మధ్యేవాదమే నేటి మార్గం

మధ్యేవాదమే నేటి మార్గం - Sakshi


ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా మాక్రాన్‌ ఘనవిజయం, ట్రంప్‌ వైఫల్యాల రేటింగ్‌లు, ఏంజెలా మర్కెల్‌ సంఘటితపడటం, బ్రెగ్జిట్‌ పట్ల విచారం వంటివి అన్నీ... చాలా ఎక్కువ భాగం మధ్యస్త ప్రాంతాన్ని ఖాళీగా వదిలేశారని రుజువు చేస్తాయి. మనం, భారత ఉదారవా దులం మన బుర్రలను  తెరవాలి. సమాజం, ఆర్థిక వ్యవస్థపట్ల ఉదారంగా, రాజ్యాంగ బద్ధత, జాతీయ భద్రత పట్ల రాజీలేకుండా, ఉగ్రవాదానికి లేదా మావోయిస్టు హింసకు ‘‘మూల–కారణాల’’ సమర్థనను ఆమోదించకుండా ఉండే భావనను నిర్మించాలి.



కెనడా యువ ప్రధాన మంత్రి, ప్రపంచస్థాయి ప్రముఖ ఉదారవాద నేత అయిన జస్టిన్‌ ట్రూడో, ‘‘హైఫనేటెడ్‌ ఉదారవాది’’అనే పదాన్ని మొదటిసారిగా ప్రాచుర్యంలోకి తెచ్చారు (ఉదారవాదులలోని వామపక్ష–ఉదారవాది, మితవాద–ఉదారవాది, మధ్యేవాద–ఉదారవాది వంటి బృందాలు తమ ప్రత్యేక గుర్తింపుకోసం ఉదారవాది అనే పదానికి ముందు సదరు విశేషణాన్ని చేరుస్తూ హైఫన్‌ లేదా అడ్డ గీతను వాడుతుంటారు. వారిని ఉద్దేశించే ట్రూడో హైఫనేటెడ్‌ ఉదారవాది అనే పదబంధాన్ని ప్రయోగించారు). ఆయన దాన్ని పలు పక్షాలుగా, చీలిపోయి ఉన్న తమ పార్టీ వారినందరినీ ఒక్కటి చేయాలనే పరిమితార్థంలోనే వాడినా అది విస్తృతంగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. 


కనీసం మన దేశీయ పరిస్థితుల నేపథ్యంలోనైనా డీౖహైఫనేటెడ్‌ లిబరలిజం (హైఫన్‌లు లేని లేక ముందు చేర్పులు లేని ఉదారవాదం) అనే భావనకు కర్తృత్వం నాదేనని చెప్పుకుంటాను. అన్నిటినీ ఆహ్వానించే విశాల దృష్టితో భావాలను, ప్రజలను చూడటం ఉదారవాదమైనట్టయితే... ఈ ముందు చేర్పుల విధేయతలతో కూడా అది మనగలుగుతుందా? వామపక్షవాదం, మితవాదం అనేవి మాత్రమే ఎంచుకోవడానికి ఉన్న రెండు స్థూల విభాగాలు. ఇక ‘‘మధ్యస్తం’’అనేది సోమరి, నిర్ణయరాహిత్య వాదుల కోసం కేటాయించిన స్థానం. మన దేశంలో అది న్రెçహూ మృదు సామ్యవాదం నుంచి, ఇందిర ముదురు గులాబీ రంగు నుంచి (అది దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ కాషాయ గులాబీరంగులాంటి ఒకరకం ముదురు రంగు, నేడు అస్తిత్వంలో ఉన్న లాంటిదే) పుట్టుకొచ్చిన ఉదారవాదం కావచ్చు.



ఇరుపక్షాల పరీక్షలూ గట్టెక్కలేం

లేదా వంద రకాల నుంచి దేన్నయినా ఎంచుకోవచ్చు. వామపక్షం నుంచి ప్రారంభిద్దాం. జనరల్‌ రావత్, జనరల్‌ డయ్యర్‌కు ‘‘ప్రతిధ్వని’’అని కనిపెట్టిన సామాజిక శాస్త్రవేత్త్త పార్థా ఛటర్జీనే తీసుకుందాం. ఆ వ్యాఖ్య చేసిన తర్వాత ఆయన మన ఈశాన్యంలోని ఆదివాసి రాష్ట్రాలు, కశ్మీర్‌ వలసవాద వారసత్వంగా సంక్రమించినవని నొక్కి చెప్పారు. తద్వారా మన నిబద్ధతను అత్యున్నత స్థాయి పరీక్షకు నిలబెట్టారు. రిపబ్లిక్‌ను రాజ్యాంగం ఎలా నిర్వచించిందనే దానితో నిమిత్తంలేదు... పార్థా ఛటర్జీ వాదన ప్రకారం ఈశాన్యం బ్రిటిష్‌ వారు జయించినది, కశ్మీర్‌ మన సొంత సైన్యమే జయించినది.



లేదంటే పూర్తి మితవాద పక్షానికి తిరిగి, దేవాలయాలలో దళితుల సమానత్వం కోసం పోరాడే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన తరుణ్‌ విజయ్‌నే తీసుకోండి. ఢిల్లీ గోల్ఫ్‌ క్లబ్‌ ఒక మేఘాలయ ఆదివాసిని జాతివివక్షతో అవమానపరచినందుకుగానూ, దాని లైసెన్స్‌ను రద్దుచేసి, దాన్ని ఈశాన్య ప్రాంత సాంస్కృతిక కేంద్రంగా మార్చాలని ఆయన కోరారు. ఆయన సొంత భావజాలం అవే జాతులకు వాటి సాధారణ ఆహారాన్ని (ఈశాన్య ఆదివాసులకు గొడ్డు మాంసం) నిరాకరించడానికి, ఆ గొడ్డు మాంసంపై ఆధారపడ్డ తోళ్లు, పాదరక్షల తయారీ జీవనాధారాన్ని దళితులకు నిరాకరిం^è డానికి అనాగరికమైన ఉద్యమం సాగించడంలో మునిగి ఉన్నా ఫర్వాలేదు. మరింత సమకాలీనమైన ఉదాహరణను చూపాలంటే, జంతర్‌ మంతర్‌ నిరసనకు మీరు వెళ్లారా, లేదా? లేక  #NotInMyName అనే హ్యాష్‌ట్యాగ్‌ను ప్రయోగించారా లేదా? అనేదాన్ని బట్టి కూడా మీపై తీర్పు చెప్పవచ్చు. ఈ రెండు పరీక్షలలోనూ ఈ రచయిత విఫలమౌతాడు.

 

మన భుజాల మీద ముద్రలు ఉంటాయి. ముద్ర బరువు ఎక్కువయ్యే కొద్దీ ఆ భారమూ ఎక్కువవుతుంది. దీంతో అన్నిటినీ ఆహ్వానించే విశాల దృక్ప«థాన్ని నిలుపుకోవడం మరింత కష్టమౌతుంది. లేదా మీరు ఒకవేళ దాన్ని నిలుపుకుంటే, ఇబ్బందికరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాలి. ‘‘మీరు అదే పనిగా ఆ ççపక్షానికి, ఈ పక్షానికి మారుతుంటారు ఏమిటి? మీది ఏ పక్షమో నిర్ణయించుకోలేరా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారుగా ఉంటారు ఎందుకు? లేదా మరింత సముచితమైనది, తూలనాడేదైన హిందీ నానుడిని ప్రయోగిస్తే.. అన్నం కంచంలోని వంకాయ ముక్కలా ఉంటారెందుకు?’’(ఒక స్థానంలో నిలకడగా ఉండరెందుకు అని). గొడ్డుమాంసం వివాదంపై కొట్టి చంపుతున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన భావజాలాన్ని ఖండించాక మీరు... ఎయిర్‌ ఇండియాను అమ్మేయడానికి చర్యలు చేపట్టినందుకు ఆయనను సంస్కర్తగా ప్రశంసించారనుకోండి.


అప్పుడు వామపక్షం మిమ్మల్ని అమ్ముడు పోయారు అనడాన్ని వినాల్సి వస్తుంది. ఇక మితవాద పక్షానికి వస్తే, కొన్ని పరిమితులున్నా కశ్మీర్‌పై భారత పక్షం వాదనను బలంగా సమర్థించిన చరిత్ర మీకు ఉన్నా... ఒక ఆర్మీ మేజర్‌ మానవ కవచాన్ని వాడటాన్ని ఖండించడంతోనే వారి దాడి మొదలవుతుంది. మీరు భారత పక్షాన ఉండి, భారత సైన్యం పక్షాన లేకుండటం ఎలా సాధ్యం? లేదంటే, రావత్‌/డయ్యర్‌ పోలికను అందరి దృష్టిని ఆకట్టుకోవడం కోసం అర్థరహితంగా తెచ్చిన పోలిక అన్నందుకు మీరు మధ్యేపక్షం నుంచి దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విద్వద్వేత్త ఎంత లబ్ధప్రతిష్టులో తెలిసి కూడా ఆ మాట అనడానికి నీకు ఎంత ధైర్యం?



ప్రశ్నించడమే ఉదారవాద సారం

ఈ మూడు గ్రూపుల ప్రశ్నలకూ సమాధానాలు సరళమైనవే. రెండు తప్పులు ఒక ఒప్పు కానట్టుగానే, ఓ డజను తప్పులైనాసరే ఒక ఒప్పు ఉన్నదని అంగీకరించ నిరాకరించేలా చేయలేదు. రెండు, మీరు మీ దేశానికి, సైన్యానికి మద్దతు తెలుపుతున్నారంటే దాని అర్థం.. రాజ్యాంగపరంగా చట్టవిరుద్ధమైన, సైనికంగా అనైతికమైన చర్యకు పాల్పడ్డ ఒక సైనికాధికారికి మరో ఆలోచనే లేకుండా మద్దతు తెలపడమని అర్థం కాదు. మూడు, ప్రతిష్టలకు వాస్తవాలతో సంబంధం ఏముంది? ఒక మేధావి ప్రతిష్ట, ఇతరుల (వారు తక్కువవారే, నిజమే) నోళ్లను నొక్కేయడానికి సమర్థన అయ్యేట్టయితే అది ఉదారవాద చర్య కాదు. అయినా మీరు దాన్ని ఉదారవాదమనే అనొచ్చు, కాకపోతే దానికి ముందు మీ నిర్వచనానికి తగ్గట్టుగా ఓ ముందు చేర్పు మాటను (హైఫన్‌తో వచ్చేది) కనిపెట్టాల్సి ఉంటుంది.



ఈ అంశాలపై ప్రపంచవ్యాప్తంగానే చాలా రాశారు, చర్చించారు. ట్రంప్‌ ఉత్థానం, బ్రెగ్జిట్, లీ పెన్‌ భయమూ, వీటితోపాటూ వారి ప్రత్యర్థి పక్షం మరింతగా రాడికలైజ్‌ కావడమూ జరిగాయి. »ñ ర్నీ శాండర్స్‌ డెమోక్రాట్లు, జెర్మీ కార్బిన్‌ లేబర్‌ పక్షీయులు అలాంటి వారే. ఇక దీనికి సమాంతరంగా మోదీ, షాల బీజేపీ మరింత కరడుగట్టిన కాషాయ జాతీయవాదం వైపుకు మారడం, దాని ప్రత్యర్థులు మరింత సునిశితమైన, అతి ఉదారవాదానికి (హైపర్‌–లిబరలిజం) మారడం జరిగాయి. అందువలన ఒక పక్షం, ‘‘భారత్‌ తేరే తుక్‌డా..’’ (భారత్‌ ముక్క చెక్కలు అవుతుంది) అంటూ నినాదాలు చేసినందుకు జేఎన్‌యూ విద్యార్థులను లాకప్‌లో పడేస్తే, మరో పక్షం క్యాంపస్‌లోకి వచ్చిపడుతుంది. ఫలితం మొదటి పక్షం గెలుస్తుంది. వారితో విభేదించడంలాగే నినాదాలు చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించే వ్యక్తి స్వేచ్ఛలలో విశ్వాసం ఉన్న  నష్టపోయేది ఉదారవాద భారతీయుడే.


మన రిపబ్లిక్కు, దాని రాజ్యాంగాలు చెక్కుచెదరకుండా ఉంటేనే ఈ స్వేచ్ఛలకు అత్యుత్తమ పరిరక్షణ లభిస్తుంది. పైగా, ఆ రెండిటి పరిరక్షణకు రాజ్యం బలప్రయోగానికి దిగడం న్యాయమైనది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ రాజ్యం నైతిక బాధ్యత కూడా. అందువల్లనే బుర్హాన్‌ వనీని హతమార్చడంలాగే, ఒక మావోయిస్టు స్థావరాన్ని నిర్మూలించడాన్ని (గత ఏడాది ఒడిశాలో) కూడా ప్రశంసించాలి. అలాగే నినాదాలు చేసినందుకు రాజద్రోహ చట్టాన్ని ప్రయోగించడంలాగే, ఒక సాధారణ కశ్మీరీ పౌరుడిని మానన కవచంగా వాడుకోవడాన్ని కూడా ప్రశ్నించాలి.


మధ్యస్త ప్రాంతం విజయానికి కీలకం

ఉదారవాద శకం అంతం కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఈ మధ్య పలు ప్రముఖ రచనలు వెలువడ్డాయి. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత దాదాపు పాతిక ప్రజాస్వామ్యలు విఫలమయ్యాయి. టర్కీ ఆ దిశగానే సాగుతోంది. అమెరికన్‌ మీడియా సిద్ధాంతవేత్త డగ్లస్‌ రస్కాప్‌ దీనికంతటికీ కారణం మన కాలపు అసహనమేనని నిర్ధారించారు. దృష్టంతా స్వల్పకాలికమైన వాటిపైనే ఉండగా... ప్రారంభం, మధ్య, చివర అనే సాంప్రదాయక కథనాలు కుప్పకూలుతున్నాయి. అయితే అది ధ్యానాన్ని బోధించే గురువులు చెబుతున్నట్టుగా సాగడం లేదు. ఫలితం, కందకాల యుద్ధాలన్నిటిలోలాగే రెండు ప్రత్యర్థి పక్షాల నడుమ సువిశాలమైన మధ్యస్త ప్రాంతం మిగిలింది. కందకాలను వీడి బయటకొచ్చే ధైర్యమే మీకుంటే ఈ మధ్యస్త ప్రాంతం ఎంత ఉపయోగకరమైనది కాగలదో ఎమాన్యుయెల్‌ మాక్రన్‌ ఘన విజయం మనకు చూపింది. మీరు ఎన్నికల్లో గెలవాలంటే మధ్యస్త స్థానానికి చేరాలి. మాక్రాన్‌ గెలుపు, ట్రంప్‌ వైఫల్యాల రేటింగ్‌లు, ఏంజెలా మర్కెల్‌ సంఘటితపడటం, బ్రెగ్జిట్‌ పట్ల విచారం వంటివి అన్నీ... మహా సోమరిగా చాలా ఎక్కువ భాగం మధ్యస్త ప్రాంతాన్ని వదిలిపెట్టేశారని రుజువు చేస్తాయి. మార్కాన్‌ మన పదకోశానికి రాడికల్‌ మధ్యేవాదం, బలమైన మధ్యస్తపక్షం అనేదాన్ని చేర్చారు.


విజ్ఞత ఒక్కోసారి అనుకోని చోట లభిస్తుంటుంది. అన్‌బాక్స్‌ జిందగీ (జీవితాన్ని తెరవండి)అంటూ స్నాప్‌డీల్‌కు ట్యాగ్‌లైన్‌ రాసిచ్చిన కాపీరైటర్‌ బుర్రలోనూ కనిపించిందది. మనం, భారత ఉదారవాదులం మన బుర్రలను తెరుచుకోవాలి. సమాజంపట్ల, ఆర్థిక వ్యవస్థపట్ల ఉదారంగా ఉండే, రాజ్యాంగబద్ధతపట్ల, జాతీయ భద్రత పట్ల రాజీలేకుండా ఉండే, ఉగ్రవాదానికి లేదా మావోయిస్టు హింసకు ‘‘మూల–కారణాల’’ సమర్థనను ఆమోదించకుండే భావనను నిర్మించాలి. అప్పుడు మీకు జంతర్‌ మంతర్‌ లేదా హేష్‌ట్యాగ్‌లతో దేన్నో లేదా ఏ పక్షాన్నో రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హైఫన్లను విడిచేసిన ఉదారవాదులకు నాదో సూచన: వామపక్షం నన్ను మితవాది అని భావిస్తుంది. మితవాద పక్షం నన్ను వామపక్షంగా భావిస్తుంది. కాబట్టి ఇద్దరూ నన్ను బంతాట ఆడేసుకుంటున్నారు.


   

  శేఖర్‌ గుప్తా Twitter@ShekarGupta

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top