‘అధికారుల’ నోళ్లకు తాళాలేవి?

‘అధికారుల’ నోళ్లకు తాళాలేవి? - Sakshi


జాతిహితం



ప్రజాస్వామ్య దేశాల్లో రహస్యాలు శాశ్వతంగా ఉండిపోకుండా చూడటం ముఖ్యం. రహస్యాలను వెల్లడించడాలు, పునర్విమర్శలు, వాటికి ప్రతివాదాలు ఆ సంవాదాన్ని సుసంపన్నం చేస్తాయి. పరిణతి చెందిన ప్రజాస్వామ్యాలు సైతం వీటికి సంబంధించి నిబంధనలను రూపొందించుకోవడం, ప్రత్యేకించి భద్రతావ్యవస్థలోని ఉన్నతాధికారుల విషయంలో మరీ అవసరం. లేకపోతే భద్రతా అధికారులు వివేచనారాహిత్యంతో అన్నీ బయట పెట్టేయడమనే వైరస్ ప్రబలి అదుపు చేయలేనిదిగా మారే ప్రమాదం ఉంది.

 

యాకూబ్ ప్రాణాలు కాపాడాలని రామన్ అంత బలంగా భావించి ఉంటే బహిరంగంగానే మాట్లాడాల్సింది. అంతేగానీ ఒక వ్యాసాన్ని రాసి, దాన్ని ప్రచురించకుండా భద్రంగా దాచి ఉంచేవారు కారు. అదొకవేళ మిగతా నిందితుల విచారణకు హాని కలగజేస్తుందని ఆయన భయపడి ఉన్నా, యాకూబ్ శిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించాకనైనా మాట్లాడాల్సింది. కానీ వివేచనతో కూడిన నైతిక ధైర్యం ఆయనకు కొరవడింది.

 

ఆయుర్వేదం, యోగ, నయం చేయలేని జీవనశైలి సంబంధమైన వ్యాధు లేవీ లేవని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. ఆయుష్ (ఆయుర్వేదం, యోగ, ప్రకృతి వైద్యం, యునానీ, సిద్ధ, హోమియోపతి) శాఖ సహాయ మం త్రియైన ఆయన ఢిల్లీలో ఈ నెల 14న జరిగిన భారత మహిళా పాత్రికేయుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. వేదకాలం నుంచి మనకు వార సత్వంగా సంక్రమించిన ఈ అద్భుత చికిత్సలను, స్వస్థతను చేకూర్చగల శక్తు లను ధిక్కరించగల వ్యాధి ఒకటి ఉన్నదని ఆయనకు సూచించాలని ఉబలా టంగా ఉంది. అది మాటల అతి విరేచన వ్యాధి.



నేను మాట్లాడేది నానా విధాలైన కాషాయ యోధుల గురించిగానీ, ఎవరో ఓ సాధు లేదా సాధ్వి గురించిగానీ కాదు. కనీసం విచక్షణా రహితంగా నోరు పారేసుకుని మనకు కావాల్సినంత వినోదాన్ని, ప్రధానికి కొంత చికా కును కలిగించే ఓ మంత్రివర్యుల గురించైనా కాదు. తోటి భారతీయుల కంటే మరింత గురుతరమైన, సున్నితమైన పనులను నిర్వహించే బాధ్యతలను నిర్వహించిన వారి గురించి. కీలక రంగాలలో వ్యక్తిగత బాధ్యతతో నిర్వహిం చాల్సిన విధులకు జీవితకాలపు వివేచనాపరత్వం ఆవశ్యకం. అలాంటి విధు లను నిర్వర్తించిన వారే ఈ మాటల అతి విరేచన వ్యాధిగ్రస్తులైతే... అది రేకె త్తించే మహా దుర్భరమైన కంపు మీ నాసికలను, మనస్థితినే కాదు, స్థూలంగా అందరి ప్రయోజనాలను సైత ం పాడుచే సేస్తుందని తెలిసీ అనాగరి కమైన ఇలాంటి భాష వాడుతున్నందుకు మన్నించాలి. పైగా ఈ వ్యాధి, ఆ ముగ్గురూ తమ వృత్తి జీవితాన్ని ఏ ఆశయాలకు అంకితం చేశారో వాటికి సైతం చెరుపు చేసేది.



‘పెద్ద మనుషులు’ కాని ఆ ముగ్గురు

ఇక మనం స్వీయాభిప్రాయ సహిత పాత్రికేయ వృత్తిలో రాణించడానికి సంబంధించిన మూడు ప్రాథమిక సూత్రాలకు తిరిగి వచ్చి ఈ తాజా ఉదం తాలను చూద్దాం. కేంద్ర  హోంశాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుత బీజేపీ లోక్‌సభ సభ్యుడు ఆర్‌కే సింగ్ వ్యవహారాన్ని, ఆ తదుపరి భారత గూఢచార సంస్థ ‘రా’ మాజీ అధిపతి, కశ్మీర్ సమస్యపై మధ్యవర్తులలో ఒకరైన ఏఎస్ దౌలత్, ‘రా’ లోనే కీలక బాధ్యతలను నిర్వహించిన సీనియర్ అధికారి దివంగత బీ రామ న్‌ల ఉదంతాలను పరిశీలిద్దాం. భద్రతా సంస్థలలో పనిచేసిన ఉన్నతాధికారి పదవీ విరమణానంతరం, ప్రత్యేకించి పదవీ విరమణ చేసిన వెంటనే ఎలా ప్రవర్తించాలనే విషయానికి సంబంధించి ఈ ముగ్గురూ అతి చెడ్డ ఉదాహర ణలుగా నిలిచారని చెప్పడానికి విచారంగా ఉంది. ‘‘అధికారియైనా పెద్ద మనిషే’’ అనే నానుడి మరీ పాతది. ఆ ముగ్గురు అధికారుల గురించి చర్చిం చేటప్పుడు దాన్ని ప్రయోగించకుండా ఉండటం కోసమే నేను ‘‘అధికారి- పెద్దమనిషి’’ అంటూ ఉద్దేశపూర్వకంగానే రెండు పదాల మధ్య హైఫన్‌ను ఉంచుతూ కొత్త నానుడిని తయారు చేశాను. ఇది భద్రతా వ్యవస్థలో కీలక బాధ్యతను నిర్వహించిన పోలీసు, సైనిక అధికారులు సహా సీనియర్ ప్రభు త్వాధికారులను కూడా అభివర్ణించేది.



ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ, నైతిక బాధ్యతతో తమ జీవితాన్ని అంకితం చేసిన వృత్తికే హాని కలగజేసేలా వంతుల వారీగా బహిరంగంగా మాట్లాడారు. వారలా మాట్లాడటంలో స్థాయి, పద్ధతులకు సంబంధించి తేడాలున్నా అదో ఉన్మాదం కాదనగలిగింది ఏదీ లేదు. అది... గప్పాలు కొడుతూ, వివేకరహితంగా పతాక శీర్షికల కోసం పాకులాడటమే కావచ్చు (సింగ్), మరి కొన్ని కాపీలు అమ్ముకోవడం కోసం కొంత వివాదాన్ని కూడా జోడించమని  ప్రచురణకర్తలు తెచ్చిన ఒత్తిడే కావచ్చు (దౌలత్) లేదా పెడదోవబట్టిన అపరాధ భావనతో మానసికంగా ముడుచుకుపోయే వారిలో కనిపించే ‘లీమా సిండ్రోమ్’గా పిలిచే బందీల పట్ల సానుభూతే (రామన్) కావచ్చు. బందీ తనను బంధించిన వ్యక్తితో ప్రేమలో పడటమనే పరిస్థితిని సూచించే ‘స్టాక్‌హోమ్ సిండ్రోమ్’కు సరిగ్గా విరుద్ధమైన పరిస్థితికి ఇటీవలే ఈ ‘లీమా సిండ్రోమ్’ భావనను ప్రవేశపెట్టారు. దీనికి గురైతే మీరు మీ ఖైదీపట్ల సానుభూతిని ప్రదర్శించడం మొదలవుతుంది.



వివేక రాహిత్యంతోనే అతి వాగుడు

వివేకరాహిత్యపు కొలబద్ధతో ఈ మూడింటినీ కొలవాల్సిన అవసర మేమీలేదు. అలాగే, మాజీ భద్రతా అధికారులు ఇలా బహిరంగంగా రహస్యా లను రచ్చకెక్కించడం ఇదే మొదలనీ కాదు. కాకపోతే ఈ ముగ్గురూ అతి తక్కువ కాలంలోనే, అదీ కూడా ఒకరి కంటే మరొకరు మరింత ఎక్కువగా భారత ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వరుసగా మాట్లాడటంలోని నిజా న్ని రాబట్టడంకోసం అధికారిక రహస్యాలను బట్టబయలు చేసే కృషి కొంత అవసరం. ప్రత్యేకించి నేను ఏమంత జాగ్రత్తగా వ్యవహరించని వ్యాఖ్యాతను. అయినా ఈ విషయంలో ఇతరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రశ్నిస్తున్నట్టుగా కనిపించినా లెక్కచేయను.



ఇక కాలక్రమానుసారంగా వెనక్కు తిరిగి చూద్దాం. పాకిస్తాన్‌కు వ్యతి రేకంగా ఇటీవల సింగ్ చేస్తున్న రభస ఎంత యుద్ధోన్మాదభరితంగా ఉందం టే... బహుశా అది శాశ్వత ఆగ్రహోదగ్రులైన వార్తా చానళ్ల తెల్ల మీసాల ఆసా ములలో అభద్రతాభావాన్ని కలిగించి ఉంటుంది. సింగ్ తాజాగా గత వారం ‘‘ఇండియా టుడే టీవీ’’కి చెందిన రాహుల్‌క న్వల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ... ఆయన ప్రలాపాలన్నిటిలోకీ విభిన్నమైనది. టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగా ఆయన 2005లో దావూద్ ఇబ్రహీంను దుబాయ్‌లో హత్య చేయడానికి వేసిన పథకాన్ని ‘‘వెల్లడి చేశారు.’’ దుబాయ్‌లో జరిగే దావూద్ ఇబ్రహీం కుమార్తె మహ్రుఖ్, పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు జావెద్ మియాం దాద్ కుమారుడు జానాయిద్‌ల వివాహానికి వచ్చినప్పుడు చేయాలని తల పెట్టిన ఈ పథకం అమలుకు పదవీ విరమణ చేసిన అజిత్ దోవల్‌ను రప్పించారని ఆయన తెలిపారు. దోవల్ యూపీఏ హయాంలో 2004-05 మధ్య మన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధిపతిగా పనిచేశారు. ముంబై చీకటి ప్రపంచంలో ‘‘ముస్లిం’’ దావూద్ ఇబ్రహీంకు బద్ధ శత్రువైన ‘‘హిం దూ’’ ఛోటా షకీల్ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్ షూటర్లు (గురి తప్ప కుండా కాల్చగల నిపుణులు) దుబాయ్‌లో పొంచి ఉండేలా చేయాలని పథకం. బహుశా ఆ పెళ్లి వద్దే దావూద్‌ను అతన్ని పుట్టించిన ఆ పైవాడి దగ్గరకు పంపేయాలనుకున్నారు.



సింగ్ కథనం ప్రకారం, ఛోటా షకీల్ ముఠాకు చెందిన ఆ ఇద్దరు షార్ప్ షూటర్లు ఢిల్లీలో ఉన్న విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి వచ్చి వారిని అరెస్టు చేయడంతో ఆ పథకం విఫలమైంది. షకీల్ మనుషుల గురించి ముంబై పోలీసులకు ఎవరో ‘‘ఉప్పందించి’’, వారిని అరెస్టు చేయిం చారని ఆయన వాదన. మన గూఢచారి సంస్థ రచించిన పథకానికి ముంబై పోలీసులు వెన్నుపోటు పొడిచారా, లేదా? దావూద్ ఇబ్రహీం తన శత్రువుకు చెందిన షార్ప్ షూటర్ల జాడను కనిపెట్టి, ముంబై పోలీసులలోని తన మిత్రు లను హెచ్చరించాడా, లేదా? లేకపోతే జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ట్టుగా... కుడి చెయ్యి ఏం చేయనున్నదో ఎడమ చేతికి తెలియకపోవడమే దీనికి కారణమా? ఇక మీరే చర్చించుకోవచ్చు. ఏదేమైనా సింగ్ ప్రలాపనల వల్ల భిన్న స్థాయిల్లో జరగాల్సిన నష్టం జరగనే జరిగిపోయింది.



వివేచనే గూఢచార సంస్థలకు ప్రాణం

భారత్ తన సొంత పౌరులను విదేశాల్లో హత్యలు చేయించడానికి సైతం వెనుకాడదని ఆయన ప్రపంచానికి చాటారు. దావూద్ కోసం హృదయం ద్రవీ భవించిపోతుండగా భుజానికి సంచీ వేలాడేసుకుతిరిగే విప్లవకారుడివంటూ నన్ను దుమ్మెత్తిపోయడానికి ముందు మీరు ‘‘ద వే ఆఫ్ లైప్’’ పుస్తకాన్ని తిర గేయండి. అది ‘‘న్యూయార్క్ టైమ్స్’’ గూఢచార వ్యవహారాల విలేకరి మార్క్ మాజెట్టీ రచించిన అద్భుతమైన పుస్తకం. అందులో ఆయన అమెరికాకు చెందిన సీఐఏ ఒక గూఢచార సంస్థ నుంచి హత్యా యంత్రంగా పరివర్తన చెందిన వైనాన్ని చిత్రించారు. అయినా ఆ సంస్థ యెమెన్‌లోని అల్ కాయిదా కీలక నేత అన్వర్ అల్ వకీల్‌పై ద్రోన్ దాడికి వచ్చేసరికి... అతగాడు ఆమెరికన్ పౌరుడైనందున అత్యున్నత స్థాయిలో (అధ్యక్షస్థాయి) లోతుగా ఆలోచించి తీసుకునే నిర్ణయం కావాలనుకోవడం విశేష ప్రాముఖ్యం గల విషయం.



భారత గూఢచార వ్యవస్థ ఒక మాఫియా ముఠాకు వ్యతిరేకంగా మరో దాన్ని చేరదీస్తుందనే వాస్తవం తెలిసిందే. అయినా ఆ విషయాన్ని ఇంతవరకు ఎన్నడూ లాంఛనంగా అంగీకరించింది లేదు. సింగ్ ఆ పని కూడా చేసేశారు. మంచి లేదా చెడ్డ ఉగ్రవాదులు అంటూ ఉండరని మనం ఎప్పుడూ అంటూ ఉంటాం. అయినా చీకటి ప్రపంచంలో మాత్రం మంచి, చెడ్డా ఉంటాయని ఎలా అనగలం?



మూడోది, మీ భూభాగంలో మేం చట్టవిరుద్ధమైన హత్యలకు పథకం పన్నామని చెప్పడం... అప్పుడు యునెటైడ్ ఎమిరేట్స్‌లోనే ఉన్న ప్రధానిని, ఆయన మిత్రులను పూర్తి సంకటస్థితికి నెట్టేసింది. అందుకోసం మనం చీకటి ప్రపంచానికి చెందిన హంతకులను వాడుకోవాలనుకోవడం అతి సులువుగా విదేశీ ఉగ్రవాద చర్య అనిపించుకుంటుంది. సింగ్ ఉద్దేశపూర్వకంగానే అలా చేశారా లేదా అనేది నేను ఇదమిత్థంగా చెప్పలేను.



నాలుగు, ఆయన ముంబై పోలీసులకు దావూద్ డబ్బు సంచులు అందు తున్నాయని ఆరోపించారు. ఐదు, దోవల్ భారతదేశం తరఫున అత్యంత నమ్మకంగా ఆపరేషన్స్‌ను చేపట్టే వ్యక్తి అని బయటపెట్టారు. తద్వారా సింగ్ నేరుగా ‘‘దోవల్ భారత హమీద్ గుల్’’ (పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ అధిపతి) అని పనిగట్టుకు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ ప్రచార యంత్రాం గానికి తోడ్పడ్డారు.



ఆయన తప్పులకు లెక్కలేదు

ఆయన వివేకరహితంగా చేసిన పనులను ఎన్నైనా ఇలా లెక్కిస్తూ పోగలం. దీనికి సంబంధంలేనిదే అయినా ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. నిర్భయ ఘటనపై నిరసన ప్రదర్శల మధ్య ఆయన ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ పోలీసులు ఆందో ళనకారులతో వ్యవహరిస్తున్న తీరును గట్టిగా సమర్థించారు. నిజానికి ఆనాటి ఢిల్లీ పోలీసుల తీరు నేడు వారు మాజీ సైనికాధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు ముందస్తు కసరత్తు మాత్రమే. సింగ్ యూపీఏలో ఉన్నారా లేదా ఎన్‌డీఏలో ఉన్నారా అనేదానితో నిమిత్తం లేదు. పంజాబీలో అనేట్టుగా లాహోర్‌లో వినాశకారకుడైన వాడు పెషావర్‌లోనైనా వినాశకారకుడే అవుతాడు.



మిగతా ఇద్దరి వ్యవహారానికి వచ్చేసరికి వారికి అనుకూలంగానైనా, ప్రతికూలంగానైనా కూడా వాదించవచ్చు. దౌలత్ కశ్మీర్ చేదు వాస్తవాన్ని బయటపెట్టడం మాత్రమే చేస్తున్నారు, హురియత్ నేతలు దాదాపు అంతా కిరాయికి పనిచేస్తున్నవారే అనే ముఖ్య విషయం కశ్మీర్ ప్రజలకు, మిగతా దేశానికి కూడా రూఢి కావడం ముఖ్యమని వాదించొచ్చు. చిన్నా చితకా ఎత్తుగడలతోనూ, కూటనీతితోనూ, లంచాలు తినిపించడంతోనూ కొంత సమయాన్ని సంపాదించడమనే దాన్ని కొనసాగించడం కశ్మీర్ సమస్యతో వ్యవహరించే వ్యూహంగా ఉంటోంది. దౌలత్ కథనం... ఇది మనగలిగేదేమీ కాదని, నూతన వైఖరికి రూప కల్పన చేయడం అవసరమని ఢిల్లీలోని కొత్త ప్రభుత్వానికి గుర్తు చేసే పద్ధతి కూడా అవుతుంది. ఇక రామన్ విషయానికి వస్తే, ఆయన ఘటికుడైన గూఢచారి అధికారి మాత్రమే కాదు, అంతరాత్మ ఉన్న మనిషి కూడానని మీరనవచ్చు. కస్టడీలో ఉండి సహకరించిన ఉగ్రవాది ప్రాణాలను కాపాడా లని ప్రయత్నం చేయాల్సిన నైతిక బాధ్యత ఆయనకు ఉన్నదనీ వాదిం చవచ్చు. అరెస్టు అయ్యేలా భారత ప్రభుత్వం అతడితో ముందుగా ‘‘మాట్లాడింది’’ కాబట్టి అతని పట్ల దయ చూపాల్సి ఉన్నదనీ అనొచ్చు.



కానీ ఆ ఇద్దరు చేసినదీ సమస్యాత్మకమైనదే. ఇద్దరూ ఇప్పుడు నడు స్తున్న పరిణామాలపై ఉన్న ముసుగును తొలగించేశారు. ఒక రహస్య ప్రేమ కార్య కలాపం కథనాన్ని, అది ముగిసిపోయాక తగినంత సమయం గడిచాక, దానివల్ల ఆ వ్యక్తులకు, వారి మిత్రులకు బాధ కలగకుండా వారు గతించాక రాయడం వేరు. రాజకీయవేత్తలు, గూఢచారి అధికారులు, చివరికి పాత్రి కేయులు సైతం మరింత పెద్ద ప్రయోజనం కోసం తమకు సమాచారం అందిం చిన వ్యక్తులు (సోర్స్) ఎవరో ఎప్పటికీ బయటపెట్టరు. ‘వాషింగ్టన్ పోస్ట్’కు చెందిన బాబ్ వుడ్‌వార్డ్, కార్ల్ బెర్నిస్టీన్‌లు వాటర్‌గేట్ కుంభకోణాన్ని బయట పెట్టినా, ఆ సమాచారాన్ని అందించిన ‘‘డీప్ థ్రోట్ ’’ ఎవరో ఆయన మరణా నంతరం వరకు వెల్లడించలేదు.



నైతిక ధైర్యం లోపించింది

రామన్ సైతం తనకు సహకరించిన వ్యక్తుల పేర్లను బయటపెట్టలేదు. కానీ, తాను సైతం నిస్సందేహంగా నేరస్తుడని భావించిన యాకూబ్ మెమెన్ పట్ల ఉదారవాద సానుభూతి పెంపొంద డానికి దోహదపడ్డారు. యాకూబ్ ‘‘భారత వ్యవస్థ’’ చేతుల్లో వంచనకు గురైన బాధితుడనే అభిప్రాయం ముస్లింలలో, ప్రత్యేకించి ముస్లిం యువతలో ఉంది. దానికి రామన్ సామం జస్యాన్ని కల్పించారు కూడా. రామన్ బతికే ఉంటే యాకూబ్‌ను ఒక హీరోగా సమాధి చేయడానికి పోగైన జనాలు ఎలాంటివారో చూసి విచారించి ఉండేవారు.



నేడు లేని ఒక వ్యక్తిని గురించి ఇలా అనడం ఇబ్బందికరంగానే ఉన్నా చెప్పక తప్పడం లేదు... రామన్ తానొక నైతికపరమైన పిరికివాడినని రుజువు చేసుకున్నారు. యాకూబ్ ప్రాణాలు కాపాడాలని ఆయన అంత బలంగా భావించి ఉంటే బహిరంగంగానే మాట్లాడాల్సింది. అంతేగానీ ఒక వ్యాసాన్ని రాసి, దాన్ని ప్రచురించకుండా భద్రంగా దాచి ఉంచేవారు కారు. అదొకవేళ మిగతా నిందితుల విచారణకు హాని కలగజేస్తుందని ఆయన భయపడి ఉన్నా, యాకూబ్ శిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించాకనైనా మాట్లాడాల్సింది. కానీ వివేచనతో కూడిన నైతిక ధైర్యం ఆయనకు కొరవడింది. రా వ్యవస్థాప కుడు ఆర్‌ఎన్ కావో శిష్యుడినంటూ ఆయన తనను తాను ‘‘కావోబాయ్’’గా పిలుచుకున్నారేగానీ అందుకు భిన్నంగా ప్రవర్తించారు. చివరికి ఆయన తన ఆశయానికే తీవ్ర న ష్టం కలగజేశారు.



ప్రజాస్వామ్య దేశాల్లో రహస్యాలు శాశ్వతంగా అలాగే ఉండిపోకుండా చూడటం ముఖ్యమైనది. రహస్యాలను వెల్లడించడాలు, వాటిపై పునర్విమ ర్శలు, వాటికి ప్రతివాదాలు ఆ సంవాదాన్ని సుసంపన్నం చేస్తాయి. అయితే పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు సైతం వీటికి సంబంధించి నిబం ధనలను రూపొందించుకోవడం, ప్రత్యేకించి భద్రతా వ్యవస్థలోని ఉన్నతాధి కారుల విషయంలో మరీ అవసరం. అమెరికాలో ఇలాంటి అనుమతులకు, పరిశీలనకు విస్తృత యంత్రాంగం ఉంది. సీనియర్ ఎమ్15 అధికారి పీటర్ రైట్ సంచలనాత్మక స్మృతుల ‘‘స్పైకేచర్’’ ప్రచురణ తదుపరి బ్రిటన్‌లో ఈ అంశం చర్చకు వచ్చింది. వివేచనారాహిత్యమనే ఈ వైరస్, అంటువ్యాధిగా ప్రబలి అదుపు చేయలేనిదిగా విజృంభించకముందే దాన్ని నియంత్రించడం అవసరం.



శేఖర్ గుప్తా

Twitter@Shekargupta.

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top