లేత నెత్తుటి సాక్షిగా ఉగ్ర సవాల్

లేత నెత్తుటి సాక్షిగా ఉగ్ర సవాల్ - Sakshi


కాలువలో ఒక పుట్టి మునగడం నుంచి తుపానైనా, ఉప్పెనైనా, కరువైనా, కాటకమైనా, జాతుల పోరాటాలైనా, ఉన్మాదమైనా, ఉగ్రవాదమైనా... మొదట బలయ్యేది పిల్లలు, మహిళలు, ఇతర బడుగు, బలహీన వర్గాలే. పసికందులు నిష్కారణంగా బలైన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు. పెషావర్‌లో ఏ పాపం ఎరుగని పసిబిడ్డలు శవాల కుప్పలుగా మారడం అందరినీ కలచివేసింది. ఇది ప్రతీకార చర్య అని తాలిబన్లు సమర్థించుకున్న తీరు దుర్మార్గమైనది. హానిచేయని ఏ జీవికీ శిక్ష విధించరాదని ఖురాన్ నొక్కి చెబుతోంది. కాబట్టి ఇది రాక్షసత్వమవుతుంది తప్ప, ఇస్లామిక్ తీవ్రవాదం కూడా కాజాలదు!

 

 ఉగ్రవాదానికి హృదయమే కాదు, కళ్లూ ఉండవని పాకిస్తాన్‌లోని పెషావర్ మారణకాండ మరోమారు స్పష్టం చేసింది. కల్లాకపటమెరుగని పసిరక్తం పారిం చి ఉగ్రమూక మానవ చరిత్రనే మలినం చేసింది. అన్నెంపున్నెం ఎరుగని పిల్లల్ని లక్ష్యం చేసుకొని సాగించిన ఈ దురాగతం, ఒక దుర్ఘటనగా కన్నా భవితకు సంబంధించిన అత్యంత ప్రమాదకర సంకేతం. అటు దేశానికి హితం చేయక, ఇటు మతానికి మేలు చేయక... మౌడ్యంతో పెట్రేగే రక్కసి ఉగ్రవాదం  పసికూన లను తన లక్ష్యాలుగా మార్చుకోవడం అత్యంత ప్రమాదకరం, హేయం! అరుదైన ఘటనలుగా కాక ఇటువంటి దుశ్చర్యలు వ్యవస్థీకృతంగా జరిగితే ప్రపంచ మానవాళే గడగడ వణకాల్సిన పరిస్థితి.

 

  ఏ రక్షణ కవచం లేకుండా సాగే సరస్వతీ నిలయాలపై మున్ముందు ఇలాగే  ముష్కర దాడులు సాగితే భావి ప్రపంచ పౌరుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలవాల్సిందేనా? ఈ తీవ్రతను గుర్తించి, దుస్థితిని తప్పించే మార్గాన్వేషణ చేయాలి. అంతే తప్ప, మనం ఇంకా రాజకీయ ఉదారవాదంతో ఖండనలు, ప్రకటనలతో సరిపెట్టే సమయం కాదని విశ్వ సమాజం, ముఖ్యంగా పాక్ పాలకులు గుర్తించాల్సిన తరుణమిది. ఉగ్రవా దాన్ని పెంచి పోషిస్తూ తాము పులిపైస్వారీ చేస్తున్నామన్న నిజాన్ని గ్రహించే స్థితిలో పాక్ పాలకులు లేరు. అంతకన్నా దారుణమైన విషయం... ఎక్కడో, పాక్ భూభాగానికి దూరంగా కూర్చుని ఇంకా రాజకీయ వ్యాఖ్యలతో పబ్బం గడుపుతున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ప్రకటన. పాకిస్తాన్ ప్రజల్ని ఇంకా ఓటు బ్యాంకులుగానే భావిస్తూ, ఎలాగైనా మభ్యపెట్టగలననే భ్రమల్లో బతుకుతున్న ఆయన, తాలిబన్ల వెనుక భారత ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఉందనే చచ్చు పుచ్చు ప్రకటన చేశారు.

 

 ఈ విషయంలో పాకి స్తాన్ ప్రభుత్వం కూడా ఏం తక్కువ తినలేదు. భారత్ విషయంలో దాని వైఖరే ఇందుకు నిదర్శనం. ఎప్పుడు సంఘటన చోటు చేసుకుంటే అప్పుడు, ఎవరికి నష్టం జరిగితే ఆ దేశం అన్న పద్ధతిన ఎక్కడికక్కడ చేపట్టే చర్యలు ఉగ్రవాదాన్ని అణచడంలో ఫలితాలనివ్వవు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రచిస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రక టించి 24 గంటలు గడవలేదు ఆ సమీకృత కృషికి గండిపడింది. తాజా దాడికి బాధ్యులమని ప్రకటించుకున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాక్ నేత ఫజ్లుల్లాను తమ కు అప్పగించాలని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రహీల్ షరీఫ్ ఒక వైపు అప్ఘానిస్తా న్‌ను డిమాండ్ చేస్తున్నారు.



మరోవైపు, ముంబై ఉగ్రదాడుల కేసు నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్తాన్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లఖ్వీకి బెయిలు తాలిబన్ల డిమాండ్ కావడం దురదృష్టకరం! పాక్ పాలకుల ఈ ద్వంద్వ వైఖరి తరచూ కనిపిస్తున్నదే. భారత్‌లో విధ్వంస చర్యలకు పాల్పడే ముష్కర మూక లకు పాకిస్తాన్ సురక్షిత స్థావరమౌతోంది. ముంబై దాడుల్లో కుట్రదారులైన హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంలను అప్పగించాలని భారత్ తాజాగా మరో మారు పాకిస్తాన్‌ను కోరింది. ఎల్లలెరుగని హింసోన్మాదంతో తీవ్రవాదులు పేట్రేగిపోతూనే ఉంటారు, నాయకులు రాజకీయ ప్రకటనలతో పబ్బంగడుపు తూనే ఉంటారు. ఇది రివాజయిన తంతుగా కొనసాగినంత కాలం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.

 

 పసికందులు బలిపశువులు

 చిన్న కాలువలో పుట్టి మునగడం నుంచి దేశాల మధ్య జరిగే పెను యుద్ధాల వరకు మొదట బలయ్యేది పిల్లలే! తుపానయినా, ఉప్పెనయినా, కరువైనా, కాటకమైనా, జాతుల పోరాటాలయినా, ఉన్మాదమైనా, ఉగ్రవాదమైనా.... ఏ ఉపద్రవం ముంచుకువచ్చినా నిష్కారణంగా మొదట బలయ్యేది పిల్లలు, మహి ళలు, ఇతర బడుగు, బలహీనవర్గాలే. మానవ ఇతిహాస పరిణామంలో అనేకా నేక దుర్ఘటనల్లో సంబంధం లేకపోయినా, కారకులు కాకున్నా... మంచి చెడు తెలియని పసి జీవితాలు బలైన సందర్భాలు కోకొల్లలు. పెద్దల ఉన్మాదపు చర్య లకు పిల్లలు బలికావడం కొత్తేమీ కాదు. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా అణుబాంబులు విసిరినా, నాజీలు పిల్లల్ని యుద్ధ శిబిరాల్లోకి కవాతు చేయిం చినా, చంకల్లో తుపాకులు పెట్టి శ్రీలంకలో ఎల్టీటీఈ బాల సైనికుల్ని తీర్చి దిద్దినా.. అమానవీయంగా బలయిపోయింది బాలలే! రువాండా అంతర్యుద్ధం లో నాలుగు నెలల్లోనే మూడు లక్షల మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారన్న ఐక్యరాజ్యసమితి లెక్క వినేవారికి కన్నీరు తెప్పించదా!

 

 ఉగ్రవాదమో, ఉన్మాద మో... వాటిని పెంచి పోషించిన, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపేక్షించిన పెద్దమనుషుల చేతులన్నీ పిల్లల రక్తంతో తడిబారినవే! పెషావర్‌లో ఉన్మాదుల మూకుమ్మడి కాల్పులకు ఏ పాపం ఎరుగని పసిబిడ్డలు శవాల కుప్ప లుగా మారడం ప్రతి మానవ హృదయాన్నీ కలచివేసింది. ఇది తమ ప్రతీకార చర్య అని, ఇందుకోసం కావాలనే సైనికుల పిల్లలనే లక్ష్యంగా ఎంచుకున్నామని సమర్థించుకున్న తాలిబన్ల అధికార ప్రతినిధి మహ్మద్ ఉమర్ ఖొరాసని మాట లు దుర్మార్గమైనవి. ‘‘మా కుటుంబాల్ని, భార్యాపిల్లల్ని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది, ఆ బాధేంటో వారికి తెలియజెప్పాలనే, మేం సైనికుల పిల్లల్ని ఎంపిక చేసుకున్నాం’’ అనే వాదన అత్యంత ప్రమాదకరమైంది. పిల్లలేం పాపం చేశారు? సైనికోద్యోగులేం తప్పు చేశారు? పాలకుల, ప్రభుత్వాల నిర్ణయాలను అమలుచేస్తూ దేశ రక్షణకోసం విధులు నిర్వర్తించేవారు సైనికులు.

 

 ఇంకా పచ్చి గా చెప్పాలంటే, జీవితాన్ని నెట్టేందుకు నాలుగు జీతం రాళ్ల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాస్తున్న అల్పజీవులు. అటువంటిది పొట్ట కూటి కోసం ఉద్యోగం చేస్తున్న సైనికుల పిల్లలపైన ప్రతీకారమేంటి? ఇస్లాంలో ఓ గొప్ప సందేశముంది. అదెంత చిన్నదయినా, పెద్దదయినా శిక్ష అనేది హాని చేయని ఏ జీవికీ విధించకూడదనే మౌలికాంశాన్ని ఖురాన్ నొక్కి చెబుతోంది. ప్రాణాల్ని బలితీసుకోవడమనే అతి తీవ్రమైన శిక్షను అమాయకులైన పసికూన లకు విధించడం ఇస్లాం పరంగా కూడా హేతుబద్ధం కానపుడు, వారిది పచ్చి రాక్షసత్వమవుతుంది తప్ప, ఇస్లామిక్ తీవ్రవాదం కూడా కాజాలదు! పాకి స్తాన్‌లో ఉంటూ ఆ దేశపు భావి పౌరుల్ని నిష్కారణంగా పొట్టనపెట్టుకున్నవారు దేశ హితంతో పనిచేస్తున్నట్టు కాదు. ఇస్లాం పేరు చెప్పుకొని రక్త పిపాసతో ఇస్లాం మౌలిక సూత్రాలకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నవారు ఇస్లాం ఉద్ధారకులూ కారు.

 

 చేతులు కాలాక ఆకులు పడితే మేలేంటి?


 పాకిస్తాన్‌లో బడిపిల్లలపై తాలిబన్ ఉగ్రవాదుల దాడులు కొత్తేమీ కాదు. వేర్వేరు సందర్భాల్లో, వివిధ రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. పసిమొగ్గల ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. 2010 నుంచి ఇప్పటివరకు కనీసం నాలుగుమార్లు పాఠశాల బస్సులపైదాడులు జరిపారు. ఇటీవల నోబెల్ శాంతి బహుమతి పొం దిన మలాలా యూసఫ్‌జాయ్‌పైన 2012లో జరిగిన దాడి ఈ పరంపరలోదే. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కనీసం నాలుగుమార్లు పాఠశాలలపై తాలిబన్లు దాడులు జరిపారు.

 

 ముఖ్యంగా వాయవ్య పాకిస్తాన్‌లో సాధారణ పౌరులకు కూడా రక్షణ లేకుండా పోయిందని పలుమార్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా హెచ్చరించింది. ఉగ్రవాదుల నుంచి పౌరులకు రక్షణ కల్పించే చర్యలు పాక్ ప్రభుత్వం చేపట్టాలని ఆమ్నెస్టీ డిప్యూటీ డెరైక్టర్ (ఆసియా-పసిఫిక్) డేవిడ్ గ్రిఫిత్ తరచూ చెబుతున్నారు. ఈ మధ్య పాక్ తమపై చేపట్టిన సైనిక చర్యకు ప్రతీకారమే పెషావర్ ఘాతుకమనే తాలిబన్ల వాదన ఏ రకంగానూ సమర్థనీ యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా, గడచిన వందేళ్ల చరిత్రలో పలుమార్లు విద్యా ర్థుల మీద, విద్యా సంస్థల మీద ఉగ్రదాడులు కోకొల్లలుగా జరిగాయి.

 

 కానీ, పదేళ్ల కింద రష్యాలోని బెస్లాన్‌లో చెచెన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల తర్వాత అంతటి పెద్ద నరమేధం ఇప్పుడు పెషావర్‌లోనే జరిగింది. పాక్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? తన స్పందనని కార్యరూపంలో ఎలా చూపిస్తుంది? అన్న దే ఇప్పుడు కీలకాంశం. ‘మంచి తాలిబన్లు, చెడు తాలిబన్లు అని ఉండరు, అం తాచెడే, తాలిబన్లు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వారీ ప్రాంతపు శాంతికి ప్రమా దకారకులు, వారిని ఉపేక్షించేది లేదు’ అంటున్న పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాటలు ఎంత మేరకు ఆచరణ రూపం ధరిస్తాయో వేచి చూడాల్సిందే! అటు అఫ్ఘానిస్థాన్‌ను అస్థిరపరచడానికి, ఇటు భారత్‌ను చికాకు పరుస్తూ ఆధిపత్యం సాధించడానికి పాకిస్తాన్ పనిగట్టుకొని తాలిబన్లను పెంచి పోషిం చింది. కత్తితో వ్యవహరించేవాడు కత్తికే బలవుతాడనే చైనా సామెతను గుర్తుతె చ్చేదే పెషావర్ ఘటన. కానీ, తప్పు పాక్ పాలకులదైతే శిక్ష పసికూనలకెందు కన్నదే ఎవరికీ జీర్ణం కావడం లేదు.

 

 పాలకులు అది గ్రహించాలి. మరణశిక్షపై మారటోరియాన్ని ఇప్పుడు పాక్ ఎత్తివేసింది. ఉగ్రవాద పీచమణచడానికి కార్యా చరణ అంటోంది. ఈ ఇంగితం ముందే ఉండాల్సింది. బాలల్ని బలిపెట్టాక ప్రభుత్వానికి మెలకువ వచ్చింది. హిరోషిమాలో ఎందరో బాలలు హతమ య్యారు. ఎందుకంటే అణుబాంబులకు వివక్ష లేదు, విచక్షణ తెలియదు. గాజా లో చిన్నారులు మరణించారు. వారిని రక్షణ కవచంగా మిలిటెంట్లు వాడు కోవడంవల్ల. రువాండాలో పసిబిడ్డలు అసువులుబాశారు, వారు ఇతర గిరిజా తుల వారు కనుక. చెచెన్యాలో చంటిపాపలు మట్టిలో కలిశారు, ఎందుకంటే వారు పరదేశీయులు అయినందున. పెషావర్‌లో బడిపిల్లలు ప్రాణాలొదిలారు, వారు పాక్ సైనికులకు పుట్టినందున. ఎంత దుర్మార్గం? ఎంత అమానవీయం? మహాప్రస్థానం చేసిన మహాకవి శ్రీశ్రీ గుర్తొస్తున్నాడు. పాపం పుణ్యం, ప్రపంచ మార్గం/ కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ఏమీ ఎరుగని పూవుల్లారా,/ పాపల్లారా / మెరుపు మెరిస్తే,/ వానకురిస్తే/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా:/ మీదే మీదే సమస్త విశ్వం:/ మీరే లోకపు భాగ్యవిధా తలు:/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు:

 ఈమెయిల్: dileepreddy@sakshi.com

 - దిలీప్ రెడ్డి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top