శాసనకర్తల వేతన యాతనలు

శాసనకర్తల వేతన యాతనలు


 నియోజకవర్గాల విస్తీర్ణం, ఓటర్ల సంఖ్య కూడా పరిగణనలోకి తీసుకుంటే మన దేశంలో ప్రజాప్రతినిధుల వేతనాలు ఎందుకూ కొరగావనే సత్యం బోధపడుతుంది. అయినా వారిపై విమర్శలు ఆగడం లేదు.

 

 న్యాయమూర్తులను న్యా యమూర్తులే ఎంపిక చేయ డం, శాసనకర్తలు తమ జీత భత్యాలను స్వయంగా నిర్ధా రించుకోవడం అనేవి మన అపరిపక్వ ప్రజాస్వామ్యానికి 14వ లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాథ్ ఛటర్జీ భావించేవారు. న్యాయమూ ర్తుల నియామకానికి సంబంధించి, పార్లమెంటు ఇటీ వల ‘కొలీజియం’ పద్ధతిని తొలగించేందుకు రాజ్యాం గానికి సవరణలు చేసింది, కొత్త చట్టాన్నీ తెచ్చింది. కానీ స్వయంగా జీతభత్యాలు నిర్ధారించుకునే హక్కును వదులుకోవడానికి పార్లమెంటు ఇప్పటికే ముందుకు రాలేదు. విమర్శలకు తావిస్తున్న ఈ పద్ధతిని మార్చడానికి ఛటర్జీ ఒక ప్రయత్నం చేశారు. 2005లో మార్చి 23న ఆయన నిర్వహించిన అఖిలపక్ష సమా వేశంలో, స్వయంగా జీతభత్యాలు నిర్ధారించుకునే పద్ధతికి స్వస్తి పలకాలని, ఈ బాధ్యతను ఒక స్వతంత్ర వేతన సంఘానికి అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణ యించారు. నేటికి దశాబ్దం గడచినా ఆ నిర్ణయం అమ లుకు నోచుకోలేదు. ఆ తర్వాత 2006, 2010లో పాత పద్ధతిలోనే ఎంపీలు జీతభత్యాలు పెంచుకున్నారు.

 

 ఇటీవలే విశాఖపట్నంలో ముగిసిన 17వ అఖిల భారత విప్‌ల మహాసభలో ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నం జరిగింది. శాసనకర్తల జీతభ త్యాల నిర్ధారణకు స్వతంత్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం ఉత్తమమని ఈ మహాసభలో తీర్మానించారు కూడా.  ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టసభలు, తమంత తాముగా సభ్యుల జీతాలను పెంచుకోవడం వల్ల వారి జీతాల పెంపుదలనే ప్రజలు వ్యతిరేకిస్తున్నా రన్న నిరాధారమైన అపప్రధ వ్యాప్తమవుతోంది. నిజా నికి కేంద్రంలోనూ, చాలా రాష్ట్రాల్లోనూ శాసనకర్తల జీతభత్యాలు నామమాత్రమే. కానీ రాజ్యాంగ సభలో ముసాయిదా అధికరణాలు 86, 170 (ప్రస్తుత రాజ్యాం గంలో 106, 195 అధికరణాలు) చర్చకు వచ్చినప్పుడు, ఈ జీతాల నిర్ధారణ బాధ్యతను చట్టసభలకే అప్పగించే ప్రతిపాదనను ఆనాటి హేమాహేమీల్లో ఏ ఒక్కరూ ప్రశ్నించకపోవడం గమనార్హం.

 

 స్వతంత్ర భారతదేశంలో ఈ అధికరణాలు ఇంత వరకూ అమలైన తీరు పరిశీలనార్హం. ఎంపీల జీతభ త్యాలు సిఫారసు చేసేందుకు మొట్టమొదటి సంయుక్త పార్లమెంటరీ కమిటీ 1952 జూన్ 6న ఏర్పాటయింది. ఈ కమిటీ ఎంపీల జీతభత్యాల చట్టాన్ని ఆమోదిం చింది. తొలి పార్లమెంటులో ఎంపీలకిచ్చిన జీతం నెలకు 400 రూపాయలు. అంతకుముందు వారికి సభ జరిగిన రోజుల్లో కేవలం దినసరి భత్యం చెల్లించేవారు. చివరిసారి ఈ జీతభత్యాలు, పింఛను చట్టాన్ని 2010లో సవరించారు. ఈ సవరణతో వారి జీతం నెలకు 50 వేల రూపాయలకు పెరిగింది. 1954 మొదలుకొని 2010 వరకు 56 ఏళ్ల వ్యవధిలో ఎంపీల జీతభత్యాల చట్టంలో 28సార్లు సవరణలు జరిగాయి. అంటే ఎంపీలు ఆచితూచి పత్రికల, ప్రజల విమర్శలను గమనంలో ఉంచుకుని స్వల్ప మొత్తాల్లోనే తమ జీతాలను పెంచుకున్నారని స్పష్టమవుతోంది. స్వయంగా జీతాలు నిర్ధారించుకుంటే జరగగల నష్టం గురించి రాజ్యాంగ సభలో డా॥పీఎస్ దేశ్‌ముఖ్ 1949, మే 20న ఈ విధంగా హెచ్చరించారు.

 

 ‘‘...సభ్యులకు తగినంతగా వేతనాలు చెల్లిం చాలి.... కొంత మంది సభ్యులు తమ సొంత భత్యాల గురించి మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు... ప్రభుత్వం (మన సమస్యలను) అర్థం చేసుకోగల ప్రజ ల నుండి వచ్చే విమర్శలకు సిద్ధంగా ఉండాలి. కానీ సభ్యులకు సరిపడినంత జీతభత్యాలు చెల్లించాలి...’’

 శాసనకర్తలు ఎదుర్కొంటున్న విమర్శలకు మరో ముఖ్యకారణం జీతాల పెంపు ప్రక్రియలో పారదర్శకత లోపించడం మరోకారణం. సభలో చర్చ లేకుండా హడావుడిగా బిల్లు ఆమోదించడం. 1952లో వేతనాల సిఫారసుకు తొలి కమిటీ ఏర్పాటు చేసినప్పుడు, కమిటీ నివేదికపై పూర్తి స్థాయి చర్చకు సభ్యులకు అవకాశం లభిస్తుందని అప్పటి స్పీకర్ జీవీ మావలంకర్ హామీ ఇచ్చారు. కానీ పార్లమెంటు రికార్డులు పరిశీలిస్తే అది ఒట్టి హామీగా మిగిలిపోయిందని భావించక తప్పదు.

 

 2015 ఆగస్టు 21న ఢిల్లీ శాసనసభ ఈ విషయంలో ఒక ప్రగతిశీల నిర్ణయం తీసుకుంది. అక్కడి సభా సంఘం విజ్ఞప్తి మేరకు స్పీకర్ శ్రీరాం నివాస్ గోయల్, శాసనసభ్యుల జీతభత్యాలను సిఫారసు చేయడానికి సభ్యులతో సంబంధం లేకుండా ఒక స్వతంత్ర నిపు ణుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పని తుది దశకు చేరుకుంది. త్వరలోనే నివేదిక సమర్పించబో తోంది. అసంబద్ధ చట్టాల చిక్కుముడులతో సతమత మవుతున్న ఢిల్లీ శాసనసభ ఈ విషయంలో దేశంలోని మిగతా చట్టసభలకు మార్గదర్శిగా నిలిచింది.

 2005లో శ్రీ ఛటర్జీ చేసిన ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం అమల్లోకి తెచ్చి ఉంటే మన దేశం యావత్తు కామన్‌వెల్త్ దేశాలకు ఆదర్శంగా అవతరించి ఉండేది. ఆ అవకాశం 2012లో యునెటైడ్ కింగ్‌డమ్‌కు దక్కింది. యూకేలో 2012 ఏప్రిల్ నుండి పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను నిర్ధారించే బాధ్యతను ‘స్వతంత్ర పార్ల మెంటరీ ప్రమాణాల సాధికార సంస్థ’’ (ఐపీఎఫ్‌ఏ)కి అప్పగించారు. సగటు ప్రభుత్వరంగ ఆదాయాల ఆధా రంగా ఈ సంస్థ ఎంపీల జీతభత్యాలను సవరిస్తూ ఉం టుంది. ఈ సంస్థ యాజమాన్య బోర్డు 2015 జూలైలో సమర్పించిన తాజా నివేదికలోని కొన్ని పంక్తులు మన దేశంలో ప్రజాప్రతినిధులకు ఎంతో ఉపయుక్తం.

 

‘‘ఎంపీల జీతభత్యాల పరిశీలన అనేది నిస్సందే హంగా ఒక వివాదాస్పదమైన అంశం... వేతనాల పెం పుదలను నిలిపివేయడానికి వెయ్యిన్కొక్క కారణాలు చూపవచ్చు... వేతనాల పెంపుదలకు సరైన సమయ మంటూ ఏదీ ఉండదు... మన ప్రజాస్వామ్యంలో ఎంపీలు విడదీయరాని భాగం... వారికి తగినంత  జీత భత్యాలు అందించడం మన బాధ్యత. వారికిచ్చే జీతభ త్యాలు రాజకీయ జీవితంలోకి రాదలచుకున్న వారికి ఆకర్షణీయంగా ఉండాలి. ఇతరత్రా ధనికులైన వారు మాత్రమే రాజకీయాల్లో మనగలిగేంత తక్కువగా జీతా లు ఉండకూడదు’’. ఇండియాలో శాసనకర్తలకు ఇదొక సందేశం. నిపుణులను విశ్వసించండి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రజల విశ్వాసాన్ని చూరగొనండి.

 వ్యాసకర్త కార్యదర్శి, ఢిల్లీ శాసనసభ

 Suryadevara.pk@gmail.com

 - ఎస్.ప్రసన్న కుమార్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top