ఓటుకు కోట్లు గల్లీ నినాదమైందా?


ఎన్నో దశాబ్దాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది. తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా విడిపోయి, రెండు రాష్ట్రాలైనా ఆత్మీయులుగా కలిసుందా మని నేతలందరూ ప్రగల్భాలు పలికారు. ఇద్దరు ‘చంద్రు’లు అధికార పగ్గాలు చేపట్టి ఒకరిని మించి మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ, తమ పార్టీల ప్రయోజనాల మోజులో ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.  

 2009 తర్వాత ఇటీవల మరొకసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ తెరపైకి వచ్చింది. కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 63.



కానీ ఎమ్మెల్యేల కోటాలో మొన్న జరిగిన ఎమ్మె ల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు 85 ఓట్లు ఎలా వచ్చాయంటే అధికార పక్షం నుండి స్పష్టమైన జవాబు లేదు. దొడ్డిదారినే ఈ ఎమ్మె ల్యేలు సంఖ్యను పెంచుకున్నారనేది నగ్నసత్యం. ఎమ్మెల్యేలు బహిరం గంగా పార్టీ మారుస్తారు. అధికార పార్టీలో తిరుగుతారు. స్పీకర్‌కు ఫిర్యాదులందినా చర్యలు లేవు. మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. నెలలు, సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెడతారు. బ్యూరో క్రసీ అలాంటి పనులు చేస్తే చర్యలు చేపట్టవలసిన పాలకులే ఫైలు పెం డింగ్‌లో పెట్టడమంటే ప్రజాస్వామ్య విలువలను మంట కలపటమే.

 ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రకటన వెలువడగానే సందడి ఆరంభమైంది. టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి స్వయంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ దొరికిపోయా రు. ఇది చినికి చినికి  గాలివానలా మారింది. ఈ నిర్వాకం దేశవ్యాపిత చర్చగా మారింది. దీని వెనుక సూత్రధారి ఎవరు అనేది పరోక్షంగా తెలుస్తూనే ఉన్నది. టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్నది.



చంద్రబాబు ప్రమేయంపై ఆధా రాలు ఉన్నాయని, రేపో మాపో చట్టపరమైన చర్యలుంటాయని సాక్షా త్తు హోంశాఖామాత్యులు నాయిని నర్సింహారెడ్డి చెప్పి నెల కావస్తున్నా ఎలాంటి కదలిక లేదు. మరోవైపు స్టీఫెన్సన్‌తో చంద్రబాబు ఫోన్ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు అందులోని గొంతు తనది కాదని చంద్రబాబు ప్రకటించలేదు. చంద్ర బాబుకు ఏసీబీ నోటీసులిస్తుందని లీకేజీ వార్తలు వచ్చాయి. నోటీసు ఇస్తే ఒక గంటలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు ప్రకటించడం బజారు పంచాయితీని గుర్తు చేస్తున్నది.

 మరొకవైపు చంద్రబాబు, ఆయన మంత్రులు నేరుగా గవర్నర్‌నే తప్పుపడుతున్నారు. ఆయన కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారానికి పూనుకున్నారు. ఈ వ్యవహారానికి సెంటిమెంట్ రంగు పులి మేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రులు సెక్షన్- 8, 9, 10లను తెర మీదకు తెస్తున్నారు. గవర్నర్ తన పాత్ర పోషించలేదనే మాట గట్టిగా వినిపిస్తున్నారు. నెల దాటినప్పటికీ ఈ అంశం చుట్టూ రాజకీయ వ్యవస్థలు పరిభ్రమించడం సిగ్గుచేటు.



 సెక్షన్ 8ని అమలు చేయకపోతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరతామని టీడీపీ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. అనేక సుదీర్ఘ పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్ 8-9-10 లేదా ఏ ప్రతిపాదనను తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ, సంస్థ కూడా అంగీకరించవు.



 పునర్విభజన చట్టంలో పొందుపరచిన నిబంధనలను ఎవరు అతి క్రమించినా చట్టం దాని పని అది చేయాలే తప్ప తిమ్మిని బమ్మిని చేసి, కాలం గడుపుకుంటామంటే సాగదని ప్రజాస్వామ్యవాదులు హెచ్చ రికలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్రం మౌనం వీడి చట్టప రమైన చర్యలు వేగవంతం చేసేందుకు ఆదేశాలివ్వాలి.



లేకపోతే టీడీపీ ఉచ్చులో బీజేపీ పడిందనే వాదనకు బలం చేకూరుతుంది. ఇలాంటి కంపు రాజకీయాల అంతానికి వామపక్షాలు, ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు ప్రత్యక్ష ఆందోళనలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది.




 

 


 (వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి)

 ఫోన్: 040-23224966

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top