ఈవెంట్
సంజీవమ్మకు కందుకూరి పురస్కారం
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (విశాఖ శాఖ) ఆధ్వర్యంలో- జూన్ 27న ఉదయం 10 గంటలకు విశాఖపట్నం ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో కందుకూరి వీరేశలింగం స్మారక పురస్కారాన్ని డాక్టర్ పి.సంజీవమ్మకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చందు సుబ్బారావు, జె.వి.సత్యనారాయణమూర్తి, పి.దుర్గాభవాని, దేవరకొండ సహదేవరావు, ఎ.విమల, పి.శ్యామ్సుందర్, ఉప్పల అప్పలరాజు, అన్వేషి, ఎ.వి.ఆర్.మూర్తి, విరియాల గౌతమ్, పి.ఎ.రాజు పాల్గొంటారు.
గాలిలో తేలిపోతున్నాం... ఆవిష్కరణ
కూతురు రాంరెడ్డి కథల సంపుటి ‘గాలిలో తేలిపోతున్నాం’ ఆవిష్కరణ జూన్ 29న సాయంత్రం 6 గంటలకు కళాసుబ్బారావు కళావేదిక, శ్రీత్యాగరాయ గానసభ, హైదరాబాద్లో జరగనుంది. ఆవిష్కర్త: కె.వి.రమణ. పత్తిపాక మోహన్, కళా వేంకటదీక్షితులు, బి.జయరాములు, నాగబాల సురేశ్కుమార్, తాళ్ళపల్లి మురళీధర్ గౌడ్, తుమ్మూరి రాంమోహన్రావు పాల్గొంటారు.
బలివాడ కథానిక పోటీ ఫలితాలు
భారతనిధి ఫౌండేషన్, సహృదయ సాహితి సంయుక్తంగా నిర్వహించిన బలివాడ కాంతారావు స్మారక ద్వితీయ కథానికల పోటీ ఫలితాలను ఆయా ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ప్రథమ బహుమతి: బ్రతకాలి(భువనచంద్ర), ద్వితీయ: ఇది జవాబు(విహారి), తృతీయ: బొడ్డుత్రాడు(ఎస్.సలీమ్). ప్రోత్సాహక: సుగ్గి(టి.సురేశ్బాబు), దహనం(పాలగిరి విశ్వప్రసాద్). విజేతలకు నగదు బహుమతులను జూలై 2న విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో బలివాడ జయంతి సభలో ప్రదానం చేస్తారు.
శిఖామణి కవిత్వం-సమాలోచన...
నెమిలేటి కిట్టన్న పరిశోధన గ్రంథం ‘శిఖామణి కవిత్వం- సమాలోచన’ ఆవిష్కరణ జూలై 3న ఉదయం 10 గంటలకు ఎస్.వి.యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరగనుంది. ఆవిష్కర్త: ఆవుల దామోదరం. అధ్యక్షత: సాకం నాగరాజ. వక్తలు: శిఖామణి, యాకూబ్, పలమనేరు బాలాజీ, మేడిపల్లి రవికుమార్.
రొట్టమాకురేవులో విలేజ్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో- ‘పల్లెల గడపల దాకా పుస్తకాల్ని తీసుకుపోవాలన్న సంకల్పంతో’ జూలై 4న ఖమ్మం జిల్లాలోని సింగరేణి (కారేపల్లి) మండలం రొట్టమాకురేవు గ్రామంలోని గ్రంథాలయ ఆవరణలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ తెలియజేస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రదర్శనా ప్రాంగణానికి గూడ అంజయ్య ప్రాంగణంగా నామకరణం చేయనున్నారు.
ముస్లిం అస్తిత్వ సాహిత్యం పత్రాలు
బహుజన రచయితల వేదిక, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి, ముస్లిం చైతన్య వేదికల ఆధ్వర్యంలో-‘బాబ్రీ విధ్వంసం అనంతర తెలుగు ముస్లిం అస్తిత్వ సాహిత్యం’ అంశంపై జూలై 24న ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనున్న సదస్సు కోసం పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తున్నారు. ముస్లిం సాహిత్యంలోని వేర్వేరు ప్రక్రియలపై జూలై 10లోపు పత్రాలను పంపాలనీ, వాటిని సంకలనంగా తెస్తామనీ సదస్సు కన్వీనర్ నబి.కె.ఖాన్ చెబుతున్నారు. మరిన్ని వివరాలకు బరవే కార్యదర్శి ఫోన్: 9848187416
కామిశెట్టి సాహిత్య పురస్కారం కోసం
కామిశెట్టి సాహిత్య పురస్కారానికిగానూ కథకులు 2014, 2015లో ప్రచురించిన కథాసంపుటాలను మూడు ప్రతులు పంపాలని కన్వీనర్ విజయ రాంబాబు కోరుతున్నారు. అవార్డు నగదు: 10,116 రూపాయలు. చిరునామా: కన్వీనర్, 6-1-83, పోస్టాఫీస్ దగ్గర, భద్రాచలం, ఖమ్మం. ఫోన్: 9440255275
మాణిక్యమ్మ స్మారక పురస్కారం కోసం
పాతూరి మాణిక్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం-2016 కోసం సామాజిక స్పృహ కలిగిన 40 లైన్లకు మించని కవితల్ని ఆగస్టు 30 లోపు పంపాలని అధ్యక్షురాలు కవులను కోరుతున్నారు. మూడు అత్యుత్తమ కవితలకు నగదు బహుమతి ఉంటుంది. చిరునామా: పాతూరి అన్నపూర్ణ, 1156/28-1, ప్రశాంతినగర్, నవలాకుల గార్డెన్స్, నెల్లూరు-524002; ఫోన్: 9490230939