ఊడిగానికి 'ఉగ్రవాద' షరతు

ఊడిగానికి 'ఉగ్రవాద' షరతు - Sakshi


రెండోమాట

ఇక్కడ అమెరికా రాయబారిగా పనిచేసి వెళ్లిపోతూ మల్‌ఫోర్డ్  చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. 'ఆప్తవాక్య'మో, ఎగతాళో తెలియదు గాని 'నేడు అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది భారతీయ యువతే' అన్నాడాయన. అంటే, భారతీయుల నిరుద్యోగం అమెరికా ఆర్థిక ప్రగతికి 'ఎంత అవసరమో'ఇది నిరూపిస్తోంది? అందుకోసం అమెరికా వాడు 'ఫలానా వాడు ఉగ్రవాది' అంటే మనమూ ఆమోదించాల్సిందే. గుత్తపెట్టుబడులు రావడానికి ఇదో 'మార్గం' కాబోలు!




స్వాతంత్య్రోద్యమకాలంలో కూడా దళిత బహుజనులు 'అంటరానితనం' పేరుతో 'వెలి'కి గురి అవుతున్న కాలంలో, అగ్రవర్ణాలు రాక్షస ప్రవృత్తిని ప్రదర్శిస్తున్న కాలంలో బుచ్చిసుందరరామశాస్త్రి అనే కవి ఒక చలోక్తి విసురుతూ ఉండేవాడు- 'అంటరానివారెవరయ్యా అంటే, మా వెంటరాని వారే' అని. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఇదే అమలవుతోంది. తేడా- నాటి సూత్రధారులు అగ్రవర్ణాలు కాగా, నేడు సామ్రాజ్యవాదులూ, అగ్రరాజ్యాలే సూత్రధారులు. తమ శాసనానికి తలొగ్గి, తమ వెంటరాని వారంతా అంట రానివారేనని ప్రతికూల ధోరణితో అంటున్నారు.



సెప్టెంబర్ 11, 2001న అమెరికా ట్విన్ టవర్స్ వాణిజ్య కేంద్రం మీద ఉగ్రవాదులు జరిపిన పైశాచిక దాడితో దాదాపు 3,000 మంది చనిపోయారు. టవర్స్ కుప్పకూలాయి. ఇదే '9/11' ఘటనగా చరిత్ర ప్రసిద్ధమైంది. ఈ దాడి వెనుక శక్తులు బయట నుంచి వచ్చినవా? అమెరికా వ్యవస్థ పట్ల ఉన్న తీవ్ర అసంతృప్తితో నిరంతర యుద్ధాలకీ, అశాంతికీ నిరసనగా లోపలి శక్తులే తెగించి చేసిన దాడులా? అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. ఇలాంటి అనుమానాన్ని 'వాషింగ్టన్ జర్నల్' వ్యక్తం చేసింది కూడా. ఆ తరువాత అమెరికా పాలకులు బుష్, క్లింటన్‌లు ఒక నినాదం మొదలుపెట్టారు: ఇది బయట నుంచి ఉగ్రవాదులు తలపెట్టిన కిరాతక చర్య కాబట్టి, 'ఇక నుంచి ప్రపంచ ఉగ్రవాదంపైనే అమెరికా యుద్ధం ప్రకటిస్తోంది. ఈ పోరాటంలో మాతో (అమెరికాతో) చేతులు కలపని దేశాధినేతలనూ, దేశాలనూ, ప్రభుత్వాలనూ అమెరికా ఉగ్రవాదులుగా ప్రకటిస్తుంది' ప్రెసిడెంట్ జార్జి బుష్ ఈ మేరకు బహిరంగ ప్రకటనే చేశాడు.




1812 యుద్ధం తరువాత అమెరికా భూభాగం ఎన్నడూ పరాయివారి దాడులకు గురికాలేదు. ఈ సందర్భంగా కొందరు వ్యాఖ్యాతలు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పెరల్ హార్బర్‌పై దాడి ఘటనను గుర్తు చేశారు. కానీ, డిసెంబర్ 7, 1941న రెండు అమెరికా వలసలలోని సైనిక కేంద్రాల పైనే దాడులు జరిగాయి. కాబట్టి అమెరికా భూభాగం మీద నేరుగా దాడి జరగడం 2001లోనే. ఆ రెండు కాలనీలు (వలసలు)హవాయ్, ఫిలిప్పీన్స్. వీటి మీద ఎందుకు దాడి జరపవలసి వచ్చింది? వందల ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న లక్షలాది మంది స్థానికులను ఆక్రమణ దరిమిలా అమెరికా మట్టుపెట్టిం ది. మెక్సికో మీద దాడి చేసి సగభాగాన్ని ఆక్రమించుకుంది. ఇలా అరవై ఏళ్లకు పైగా ప్రపంచంలో అమెరికా ఆయుధ బలంతో సామ్రాజ్యాన్ని విస్తరించింది.




షరతుల ఆయుధంతో కొత్త దురాక్రమణ

కానీ, అమెరికా చరిత్రలోనూ, ప్రపంచ చరిత్రలోనూ 2001లో కొత్త పరిణా మం చోటుచేసుకుంది. యూరప్ ఆత్మహత్యా సదృశమైన అంతర్గత యుద్ధాల తో వినాశకర పంథాకు మళ్లింది. అవి సద్దుమణిగిన తరువాత ఇతరత్రా సామ్రాజ్య విస్తరణ కోసం ప్రపంచ దేశాల మీద దాడులు నిర్వహించింది. ఇలా అమెరికా, యూరోపియన్ వలస సామ్రాజ్యవాదులు రెండో ప్రపంచ యుద్ధం దాకా, ఆ తరువాత పారిశ్రామిక, సైనిక, యుద్ధతంత్ర వ్యవస్థల ద్వారా నిరంతరం విస్తరణపైనే దృష్టి కేంద్రీకరించారు.



కానీ ‘రవి అస్తమిం చని సామ్రాజ్యం’ అంటూ విర్రవీగిన బ్రిటన్ వలసవాదం ప్రధాన భూమిక నుంచి తోక ముడిచింది గానీ, అమెరికా మాత్రం స్వతంత్ర దేశాలతో పోరులో ప్రాణవాయువును నిలుపుకునే ఆఖరియత్నంలో ఉంది. 90 దేశాలలో సైనిక, నావికా స్థావరాల ద్వారా తుది సమరం నిర్వహించాలని వారికి ఉందిగానీ, ప్రపంచ పరిస్థితులూ లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండాలలో తమకు అనుకూ లత లేకపోవడం వంటి కారణాలతో పంటి బిగువున బతుకుతున్నారు. అం దుకే ఆర్థిక సంక్షోభాల కాలవ్యవధి కుదించుకుపోకుండా గతంలో కంటే మరింత విస్తరిస్తున్నది.



ప్రసిద్ధ ఇండియన్-అమెరికన్ ఆర్థిక నిపుణుడు డాక్టర్ రవి బాత్రా పదిహేనేళ్ల నాడే జోస్యం చెప్పారు: ‘యుద్ధానంతర కాలంలో అమెరికా మీద ఆధారపడుతూ వస్తున్న బడుగు, పేద స్వతంత్ర దేశాలు దీర్ఘ కాలిక ఆర్థిక సంక్షోభంలో ప్రవేశించినందున, ముందుగా ఇవే పెట్టుబడుల కోసం పరాధార స్థితి వల్ల పతనదశలో ప్రవేశిస్తాయి. ఆ తరువాత నిరంతర సంక్షోభాలకు కేంద్ర స్థానంగా ఉన్న అమెరికా పతనమవుతుంది.



'డాక్టర్ బాత్రా జోస్యం ఏ రూపంలో ఫలించినా ఈ కారణాల వల్లనే బ్రెటన్ ఉడ్ (అమెరికా) మంతనాల ఫలితంగా అవతరించిన ప్రపంచ బ్యాంక్, అంత ర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ల ద్వారా ప్రజా వ్యతిరేక సంస్కరణలను బలవంతంగా ప్రవేశపెట్టించి అమెరికా, యూరప్ గుత్త పెట్టుబడులకు ఆసి యాలోని ఇండియా లాంటి దేశం ద్వారా, ఆఫ్రికా దేశాల ద్వారా ద్వారాలు తెరిపించింది. అయితే ఆ గుత్త పెట్టుబడులు అంత సులభంగా వచ్చి పడవు. అవి కుప్పలుగా వచ్చి పడాలంటే స్వతంత్ర దేశాలని మురిసిపోతూ చెప్పు కునే ఇండియా వంటి వర్ధమాన దేశాలు కొన్ని షరతులను ఆమోదించి తీరాలి. ఆ షరతులన్నీ కూడా పెట్టుబడి దేశాల వారి రాజకీయ, వ్యూహాత్మక, వ్యాపార ప్రయోజనాల, సైనిక సంబంధాల రూపంలో ఉంటాయి.



ఇండియా తన బాలబాలికలను పరిశ్రమలలో నియమించరాదనీ, ప్రపంచ వాణిజ్య సంస్థకు ఎగుమతిదారుగా అర్హత సాధించాలంటే సంపన్న దేశాల వస్తూత్పత్తి ప్రమాణాలతో సరుకులు తులతూగాలనీ, పేటెంట్ హక్కుల పేరుతో సం పన్న పారిశ్రామిక దేశాలను శాసించరాదనీ చెప్పే ఇలాంటి షరతులు విధించి అమెరికా ఈరోజుకీ అమలు చేస్తున్నది.  ఇండియా వంటి దేశాల సాంకేతిక పరిజ్ఞానం కంటే 80 ఏళ్లకు ముందుకు పోయి వస్తూత్పత్తి చేస్తున్నప్పటికీ అమె రికా వర్ధమాన దేశాల ఉత్పత్తులపైన ఆ మూడు వాణిజ్య సంస్థల ద్వారా నేటికీ ఆంక్షలు విధిస్తున్నది. అమెరికా వర్ధమాన దేశాలపై కప్పిన ‘మాయ జలతారు’ ముసుగే- గుత్త పెట్టుబడుల సామ్రాజ్య 'ప్రపంచీకరణ'.




 ప్రపంచీకరణ నిజస్వరూపం

 గత శతాబ్దాలలో కూడా దేశాల మధ్య పరస్పరం వస్తూత్పత్తుల మార్పిడీ, సమాన స్థాయిలో వస్తుమార్పిళ్లూ జరగకపోలేదు. కానీ నేటి ఆంగ్లో-అమెరి కన్ సామ్రాజ్యశక్తులు రుద్దుతున్న 'ప్రపంచీకరణ' వర్ధమాన దేశాల ఉద్ధరణ కోసం కాదు. గుత్త పెట్టుబడుల ద్వారా సంపన్న దేశాల లాభాల కోసం మరో సారి ఆ దేశాలను ముడిసరుకులు సరఫరా చేసే వలసలుగా మిగిల్చడమే. ఇది ఆ సంపన్న దేశాల సరుకులతో మన సంతలను నింపే 'ప్రపంచీకరణ' ఇరాక్, ఇరాన్, ఎమెన్, అఫ్ఘ్ఘానిస్తాన్, అల్జీరియా, ట్యునీషియా తదితర దేశా లలో చమురు, సహజ సంపదలను దోచుకునేందుకు 1990ల నుంచి ఆంగ్లో- అమెరికన్ దుష్ట కూటమి సాగించిన దురాక్రమణలున్నాయి. ఆయుద్ధాలు తలపునకు రాకుండా జాగ్రత్తపడుతూ, తన దురాక్రమణను ప్రతిఘటించే శక్తులకు అమెరికా పెట్టిన కొత్త పేరే 'టైజం' అయితే తాను చేస్తున్న ఈ దురాక్రమణ యుద్ధాలను మాత్రం ఉగ్రవాదంగా పరిగణించరాదని అమెరికా కోరిక. 'తాలిబాన్'ను, ముజాహిదీన్లను పెంచిన వారు అమెరికా అధ్యక్షులే. పెంచిన ఆ చేతులు వారిపై కత్తిదూసినట్టే దూసి, మళ్లీ ఆ తాలిబాన్లతోనే నిస్సిగ్గుగా మంతనాలు జరుపుతున్నాయి. అఫ్ఘానిస్తాన్‌కు కొత్త తలనొప్పులు వారే తెచ్చి పెడుతున్నారు. క్లింటన్ అధ్యక్షహోదాలో (1993) ఐక్యరాజ్య సమితి వేదిక నుంచి ప్రసంగిస్తూ- 'దేశాలపై యుద్ధం ప్రకటించవలసివస్తే సాధ్యమైనప్పుడు మిత్రదేశాలతో కలసి యుద్ధం చేస్తాం. సాధ్యం కానప్పుడు అవసరాన్ని బట్టి ఏకపక్షంగా కూడా అమెరికా యుద్ధం ప్రకటిస్తుంది' అన్నాడు.




ఉగ్రవాదమూ పెట్టుబడేనా?

కాని మన పాలకులు మాత్రం (యూపీఏ-ఎన్డీయే) అప్పుడూ ఇప్పుడూ కూడా అమెరికా ఎత్తుగడల పట్ల 'సాఫ్ట్‌వేర్' మార్గాన్నే అనుసరిస్తున్నారు. పైగా ఏ గుత్తవర్గాలు సైనిక-పారిశ్రామిక (అమెరికా) వ్యవస్థకు కాపలాదా ర్లుగా, పోషకులుగా ఉన్నారో ఆ వర్గాలనే 'వాస్కోడిగామా'లై తరలిరమ్మని ఆహ్వానించడం ఎందుకు? ఇంకా, భారత పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు సుఖంగా, దేశీయ పరిజ్ఞానంతోనే ఉత్పత్తి చేసుకోగల 2,000 పైచిలుకు వస్తు వులను దిగుమతి చేసుకునే ఖర్మ ఎందుకు పట్టిందో పాలకులు చెప్పరు.



ఈ పరాధార స్థితి ఎలాంటిదంటే- విక్టోరియా మహారాణి పెంపుడు పిల్లి పాల కయ్యే ఖర్చును కూడా ఇండియా బకాయిగానే జమకడితే నోరెళ్లబెట్టిన (ఇం డియా నుంచి వెళ్లిపోయేప్పుడు) రాజకీయ నాయకత్వం మనది. అలాగే అమె రికన్ అధికారి, యూనియన్ కార్బయిడ్ కంపెనీ చైర్మన్ వారెన్ ఆండర్సన్ - భోపాల్ విషవాయువు విడుదలకు కారకుడై 16,000 మంది దారుణ మర ణానికి బాధ్యుడైనప్పుడూ అతడిని మన చట్టాల కింద శిక్షించడానికి పాల కులకు దమ్ములు లేకపోవడానికి కారణం-ఈ పరాధారస్థితే!



మనం ఆరోపించి, రుజువులతో శిక్షించవలసిన చోట కూడా నోరు మెదపని బలహీనులం మనం. అఫ్ఘానిస్తాన్‌లో, అంటే దాదాపు మన ముంగిట్లోనే అమెరికా పెట్టు కున్న 'నాటో' సైనిక కూటమి సేనలు జమ్మూ-కశ్మీర్‌లో ప్రవేశానికి ఎంతో వ్యవధి పట్టదు. మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఒబామా జోక్యానికి,  కశ్మీర్‌పై ఆయాచిత సలహాలు ఇవ్వడానికి, భారత్-పాక్ జాతీయ భద్రతా సంఘాల సమావేశం విఫలం కావడం పట్ల ‘తీవ్ర అసంతృప్తి’ ప్రకటించడా నికి, నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడానికి కారణం ఏమిటి?




ఆర్థికవ్యవస్థ పెట్టే ఇబ్బందులతో మనం సతమతమవుతున్న సమయం లో; ఇక్కడ అమెరికా రాయబారిగా పనిచేసి వెళ్లిపోతూ మల్‌ఫోర్డ్  చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. 'ఆప్తవాక్య'మో, ఎగతాళో తెలియదు గాని 'నేడు అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది భారతీయ యువతే' అన్నాడా యన. అంటే, భారతీయుల నిరుద్యోగం అమెరికా ఆర్థిక ప్రగతికి 'ఎంత అవ సరమో' ఇది నిరూపిస్తోంది? అందుకోసం అమెరికా వాడు 'ఫలానా వాడు ఉగ్రవాది' అంటే మనమూ ఆమోదించాల్సిందే. గుత్తపెట్టుబడులు రావడా నికి ఇదో 'మార్గం' కాబోలు!



(వ్యాసకర్త మొబైల్: 9848318414)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top