రాత్రంతా బంధించి ఆరుగురు దుర్మార్గం
గురుగ్రామ్: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. గురుగ్రామ్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మిక యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ప్రస్తుతం చేస్తున్న దానికంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి బిలాస్పూర్ అనే గ్రామం వద్ద ఆరుగురు కీచకులు లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలికి మెడికల్ పరీక్షలు నిర్వహించి నేరస్తులను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఆమెపై లూంగిక దాడికి పాల్పడిన వారిలో ఉన్న కల్లురామ్ అనే వ్యక్తి ఆమెకు తెలుసు.
అతడు మంగళవారం రోజు మానేసార్లో మంచి ఉద్యోగం ఉందని ఆ వివరాలు తెలుసుకునేందుకు ఐఎంటీ చౌరస్తా వద్దకు రమ్మని చెప్పాడు. ‘మంగళవారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో కల్లు మంచి ఉద్యోగం ఉంది రమ్మని ఫోన్ చేసి పిలిపించాడు. ఉన్నపలంగా ఐఎంటీ చౌక్కు రమ్మని పిలిచాడు. అతడిని నమ్మి గుర్గావ్ నుంచి మానేసార్కు వెళ్లాను. ఏడుగంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాను. సూపర్వైజర్ వచ్చి తీసుకెళతాడని కల్లు నాతో చెప్పి కొద్దిసేపు ఎదురుచూడమన్నాడు. 15 నిమిషాల తర్వాత సూపర్ వైజర్ అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి బైక్పై వచ్చాడు. అతడు తన బైక్పై ఎక్కించుకొని కంపెనీకి తీసుకెళ్లకుండా బిలాస్పూర్కు సమీపంలోని శంకర్ కిదాని అనే గ్రామానికి తీసుకెళ్లాడు.
అప్పటికీ ఆ అక్కడ ఓ గదిలో ఇద్దరు ఉన్నారు. తర్వాత మరో ముగ్గురు వచ్చారు. ఆ తర్వాత ఆ ఆరుగురు నాపై లైంగికదాడికి పాల్పడ్డారు. రాత్రంతా నన్ను బంధించి ఈ దారుణం కొనసాగించారు. ఎవరికైనా చెబితే చంపిపడేస్తామని బెదరించారు. కానీ, ఏదో ఒకలా ఉదయం 6గంటల ప్రాంతంలో తప్పించుకొని ఇంటికి వెళ్లి నా భర్తకు చెప్పాను’ అని బాధితురాలు చెప్పింది.