ఫేక్ కిడ్నాప్తో భర్తకు ఝలక్ ఇవ్వబోయి..

ఫేక్ కిడ్నాప్తో భర్తకు ఝలక్ ఇవ్వబోయి.. - Sakshi


ముంబయి: భార్యాభర్తలంటేనే ఉమ్మడి ఆస్తి. అసలు వ్యక్తిగత అజెండాలు ఉండే ఏ సంసారమూ ముందుకెళ్లినట్లు చరిత్రలో లేదు. ఎందుకంటే.. ఏ ఒక్కరి వ్యక్తిగత అజెండా అయినా అది అనంతరం ఉమ్మడి అజెండాగా మారాల్సిందే.. మార్చుకోవాల్సిందే. అలా లేదంటే ఆ ఇద్దరి మధ్య నీది నాది అనే భావన పెరిగి పెద్దదై సమస్యలు తెచ్చిపెట్టకతప్పదు. అచ్చం అలాగే.. నీదీ నాది అనే భావనలో పడిపోయిన ఓ భార్య ప్రాఫిట్ లో భర్త తనకు షేర్ ఇవ్వడం లేదని మాయోపాయం పన్నింది.



తనకు తానే కిడ్నాప్ చేసుకున్నట్లు నాటకాలు ఆడి దాదాపు పది లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అంతేకాదు.. తనకు తాను స్పృహకోల్పోయినట్లుగా.. కిడ్నాపర్లు హింసిస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేసి భర్తకు ఫోన్ కు వాట్సాప్ లో పంపించింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాత్రంతా గాలింపులు జరిపి చివరకు మిరా రోడ్డు స్టేషన్ లో ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.



ఆమెను విచారించే క్రమంలో అసలు విషయం బయటపెట్టింది. తామిద్దరం విజయ్ పార్క్ లో ఉంటున్నామని, తమకు ఇద్దరు పిల్లలని ఆ మహిళ చెప్పింది. తమకు ఓ కోచింగ్ సెంటర్ ఉందని, దాని ద్వారా వచ్చే ఆదాయం భర్త వాటా ఇవ్వడం లేదని అందుకే తానే ఈ డ్రామా ఆడినట్లు వివరించింది. ఇది విని పోలీసులు అవాక్కయ్యారు. మొత్తానికి 2014లో వచ్చిన హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా 'గాన్ గర్ల్'ను తలపించేలా ఆ మహిళ భర్తకు ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top