మెరీనా బీచ్ లో ఆసక్తిరేపుతోన్న ఫ్లెక్సీ

మెరీనా బీచ్ లో ఆసక్తిరేపుతోన్న ఫ్లెక్సీ


చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే నాయకుల మధ్య కాదు కార్యకర్తల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హఠాన్మరణంతో డీఎంకే పార్టీ కార్యకర్తలు విభేదాలను పక్కనపెట్టి ‘అమ్మ’ను కీర్తించారు. రాజకీయ రంగంలో ‘పురచ్చి తలైవీ’ నాయకత్వ లక్షణాలను పొగడుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జయలలిత పార్థీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన మెరీనా బీచ్‌ లో పెట్టిన ఈ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. జయను కీర్తిస్తూ ఆమె ఫొటో పక్కన తమిళంలో రాసిన వాక్యాలు అందరినీ ఆలోచింపజేశాయి.



‘మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొవడానికి మీరు లేరు. వేలాది మంది నాయకులు మాతో ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నా.. వారిలో ఒక్కరు కూడా మీలాంటి యోధురాలికి సాటిరాగలరా? రాజకీయ ఎన్నికల సంగ్రామంలో  ధీర వనితగా మీరు నిలబడినప్పుడు, మా కమాండర్ ఇన్‌ చీఫ్‌(కరుణానిధి), జనరల్‌(ఎంకే స్టాలిన్‌) ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే మంచి మనసుతో అందరి హృదయాలను మీరు గెలుచుకున్నార’ని ఫ్లెక్సీపై డీఎంకే కార్యకర్తలు రాశారు.



కాగా, జయలలిత మరణం రాష్ట్రానికి తీరని లోటని కరుణానిధి, స్టాలిన్‌ సంతాపం తెలిపారు. చేదు గతాన్ని సమాధి చేసి, కొత్త బాటలో సాగుతామని సంతాప సందేశంలో డీఎంకే అధికార ప్రతినిధి సి. శరవణన్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top