‘క్విట్‌ ఇండియా’ నినాదం ఎవరిది?




న్యూఢిల్లీ: ‘క్విట్‌ ఇండియా’ నినాదం భారతీయుల హదయాల్లో ఎంతగా నాటుకుపోయిందో బ్రిటిష్‌ పాలకుల గుండెల్లో కూడా అంతగా నాటుకుపోయి వారిని భయకంపితుల్ని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ స్వాతంత్య్రోద్యమాన్నే ఆ నినాదం ఓ మలుపుతిప్పింది. ఆ క్విట్‌ ఇండియా (1942, ఆగస్టు 8) ఉద్యమానికి నేటికి సరిగ్గా 75 ఏళ్లు. అలాంటి నినాదాన్ని కాయిన్‌ చేసిందెవరని ఎవరైనా అడిగితే ఇంకెవరు! జాతిపితి మహాత్మా గాంధీ అనేవారు నేటికి కూడా ఉన్నారు. కానీ దాన్ని ఆయన కాయిన్‌ చేయలేదు.



‘క్విట్‌ ఇండియా’ను కాయిన్‌ చేసిందీ ఆ ఉద్యమం నాటికి ముంబై మేయర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల యూసుఫ్‌ మెహరల్లీ. మేయర్‌ పదవికి ఎన్నికైన తొలి సోషలిస్ట్‌ మెహరల్లీ. ఆయన దేశ స్వాతంత్య్రోద్యమంలో ఎనిమిది సార్లు జైలుకెళ్లారు. స్వాతంత్య్రోద్యమానికి ఊపునిచ్చిన ‘క్విట్‌ ఇండియా’ అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో కే. గోపాలస్వామి రాసిన ‘గాంధీ అండ్‌ బాంబే’ పుస్తకంలో వివరించారు. దేశ స్వాతంత్య్రోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్న మహాత్మాగాంధీ తన సహచరులతో ముంబైలో సమావేశమైనప్పుడు స్వాతంత్య్ర పోరాటానికి పనికొచ్చి మంచి నినాదాలను సూచించాల్సిందిగా వారిని కోరారు. అందుకు ‘గెటవుట్‌’ అని ఎవరో సూచించారు. అదంత మర్యాదగ లేదని గాంధీ తిరస్కరించారు. ‘రిట్రీట్‌ ఆర్‌ విత్‌డ్రా’ అన్న పదాన్ని రాజగోపాలచారి సూచించారు. అక్కడే ఉన్న యూసుఫ్‌ మెహరల్లీ ‘క్విట్‌ ఇండియా’ పదాన్ని సూచించారు. యే! మేన్‌ అంటూ గాంధీ వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు. అప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న శాంతికుమార్‌ మొరార్జీ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న కే. గోపాలస్వామి తన పుస్తకంలో వివరించారు.



ఇక ఈ నినాదాన్ని, స్వాతంత్య్రోద్యమ ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ‘క్విట్‌ ఇండియా’ అంటూ విరివిగా బుక్‌లెట్లను ప్రచురించారు. అవి కొన్ని రోజుల్లోనే హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయని మెహరల్లీ జీవిత చరిత్రను రాసిన మధు దండావతే పేర్కొన్నారు. ఆగస్టు 7, 1942లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశమయ్యే నాటికి ‘క్విట్‌ ఇండియా’ పేరిట వెయ్యి బ్యాడ్జీలను కూడా తయారు చేశారు. ఆగస్టు 8, 1942లో ముంబైలోని గొవాలియా ట్యాంక్‌ మైదాన్‌ బహిరంగ సభ నుంచి ఉద్యమం ప్రారంభమైంది. ఆ నాడు ఈ నినాదం ప్రజల్లో ‘డూ ఆర్‌ డై’ అనే స్ఫూర్తినిప్పింది. గాంధీతోపాటు ఎంతో మంది నేతలు అరెస్టయినా ఉద్యమం ఆగలేదు.



ఆకర్షణీయమైన నినాదాలను కాయిన్‌ చేయడంలో యూసుఫ్‌ మెహరల్లీ ఆయనకు ఆయనే సాటి. ఆయన 1928లో కాయిన్‌ చేసిన ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదం కూడా జనంలోకి చొచ్చుకు పోయింది. నాటి బ్రిటీష్‌ ఇండియా ప్రభుత్వ పాలన మెరగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడం కోసం బ్రిటిష్‌ పాలకులు సైమన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక్క భారతీయుడికి కూడా స్థానం కల్పించలేదు. అందరూ బ్రిటిష్‌ అధికారులే ఉన్నారు. 1928లో సైమన్‌ కమిషన్‌ ముంబై రేవులో దిగినప్పుడు ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదాలలో యూసుఫ్‌ మెహరల్లీ నాయకత్వాన కొంత మంది నిరసన ప్రదర్శన జరిపారు. రేవుకు చేరుకునేందుకు మెహరల్లీ, ఆయన మిత్రులు కూలీల వేశంలో వెళ్లారని మెహరల్లీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజీ పారిక్‌ తెలిపారు. మెహరల్లీ ఆకర్షణీయమైన నినాదాలను కాయిన్‌ చేయడానికే పరిమితం కాకుండా క్విట్‌ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. ఆయన తన సహచర మిత్రులైన రామ్‌ మనోహర్‌ లోహియా, అరుణా అసఫ్‌ అలీ, అచ్యుత్‌ పట్వర్దన్‌ లాంటి నేతలను కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చారని మధుదండావతే ‘యూసుఫ్‌ మెహరల్లీ: క్వెస్ట్‌ ఫర్‌ న్యూ హారిజాన్స్‌’లో వివరించారు.


Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top