భాగ్యనగరమే భేష్..!
న్యూఢిల్లీ: నివసించేందుకు అత్యుత్తమమైన నగరంగా భాగ్యనగరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, క్లీన్ సిటీ బెంగళూరు, రాజధాని ఢిల్లీలను సైతం హైదరాబాద్ వెనక్కి నెట్టింది. అమెరికాకు చెందిన ప్రముఖ మానవ వనరుల కంపెనీ మెర్సర్ తన అంతర్జాతీయ అధ్యయన ఫలితాలను పేర్కొంటూ ఈ మేరకు 'క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్-2015'ను విడుదల చేసింది. భారతీయ నగరాల్లో నివసించేందుకు అత్యుత్తమ నగరంగా మొదటిస్థానం పొందిన హైదరాబాద్ ప్రపంచస్థాయి జాబితాలో 138వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 440 నగరాల్లో జీవన ప్రమాణాలను పరిశీలించిన మెర్సర్ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది.
హైదరాబాద్తో పాటు మరో ఆరు భారతీయ నగరాలకూ ఈ జాబితాలో స్థానం దక్కింది. జాబితాలో పుణే 145, బెంగళూరు 146, చెన్నై 151, ముంబై 152, న్యూఢిల్లీ 154, కోల్కతా 160వ స్థానాలు పొందాయి. అంతర్జాతీయ స్థాయి స్కూళ్లు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర ప్రభుత్వ సేవల వల్ల హైదరాబాద్ నగరం జాబితాలో మెరుగైన పాయింట్లను దక్కించుకున్నట్లు మెర్సర్ పేర్కొంది. ముంబై, ఢి ల్లీ వంటి నగరాల్లో జనాభా వేగంగా పెరగడం వల్ల కొన్ని దశాబ్దాలుగా తాగునీటి కొరత, వాయు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపింది. కాగా, ఆస్ట్రియా రాజధాని వియన్నా ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానం పొందింది. ఆ తర్వాతి స్థానాల్లో జూరిచ్(స్విట్జర్లాండ్), ఆక్లాండ్(న్యూజిలాండ్) నిలిచాయి.
సంబంధిత వార్తలు