ఉత్తమ్‌కే టీపీసీసీ

ఉత్తమ్‌కే టీపీసీసీ - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ సోమవారం ప్రకటన విడుదల చేశారు. వీరితోపాటు మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా అశోక్ చవాన్, జమ్మూకశ్మీర్‌కు గులాం అహ్మద్‌ను, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడిగా అజయ్ మాకెన్‌ను, గుజరాత్ పీసీసీ అధ్యక్షుడిగా భరత్‌సింగ్ సోలంకిని, ముంబై ఆర్సీసీకి సంజయ్ నిరుపమ్‌ను సోనియా నియమించినట్లు ద్వివేదీ పేర్కొన్నారు. శనివారమే తెలంగాణపై నిర్ణయం ఖరారైనప్పటికీ మిగిలిన రాష్ట్రాల కారణంగా సోమవారం ప్రకటించారు. హుజూర్‌నగర్ శాసనసభ్యుడైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా భట్టి విక్రమార్క మధిర శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


 


తెలంగాణలో పార్టీకి ఘోరమైన ఫలితాలు రావడంతో తీవ్ర అసంతృప్తికి గురైన కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా రాష్ట్రంలో పరిణామాలను సునిశితంగా పరిశీలించింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై సంఘటితంగా పోరాడటంలో ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి మధ్య సమన్వయం లేదని గ్రహించింది. ఈ పరిణామాలపై పొన్నాలను ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి పిలిపించి వివరణ కోరిన అధిష్టానం ఆయన వివరణ, పనితీరుపై సంతృప్తిచెందలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన్ను తప్పిస్తూ ఉత్తమ్‌కు పగ్గాలు అప్పగించింది. కాగా, సోమవారం ఉదయం పొన్నాల, జానారెడ్డి, భట్టి విక్రమార్క సోనియాను పార్లమెంటులో కలిశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top