మన 'గాలి'లోనూ అమెరికా వేలు!
ప్రపంచంలోని అన్ని దేశాల వ్యవహారాల్లో ఏదో ఒకలా వేలుపెట్టే అలవాటున్న పెద్దన్న అమెరికా చూపు తాజాగా భారత వాతావరణంపై పడింది. దౌత్య సహకారంలో భాగంగా భారత్లో పెరిగిపోతున్న వాయికాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. ఇందుకోసం వచ్చే రెండు మూడు నెలల్లో ఢిల్లీ కేంద్రంగా ఓ పథకాన్ని ప్రారంభిస్తామని, కాలుష్య నియంత్రణకు చేపట్టవలసిన కార్యక్రమాలపై అమెరికా వాతావరణ శాస్త్రవేత్తలు సూచనలు అందిస్తారని తెలిపారు.
అయితే ఇలాంటి 'వాతావరణ హిత' సహకారమే తమకు కూడా ఇవ్వజూసిన అమెరికాకు చైనా షాక్ ఇచ్చింది. చైనా నగరాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని, దానిని తగ్గించేందుకు సహాయపడతానని అమెరికా ప్రకటించడంపై చైనా ప్రభుత్వం మండిపడింది. ఇలాంటి ప్రకటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తాయని మండిపడింది. చైనా నో చెప్పడంతో ప్రస్తుతం అమెరికా చూపు భారత్, వియత్నాం, మంగోలియా తదితర దేశాలపై పడింది. అక్కడి గాలిలో వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.