వరదల్లో సెల్ఫీ తీసుకోబోయి..
ఢాకా: వరద నీటిలో సెల్ఫీలు తీసుకోబోయిన ఇద్దరు విద్యార్థులు ఆ ఉధృతికి కొట్టుకుపోయారు. ఈ ఘటన బంగ్లాదేశ్లోని మెలాండా పట్టణంలోని ఉమిరుద్దిన్ పాఠశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాఠశాల చుట్టూ వరద చేరుకుంది. దీంతో స్కూలును మూసివేశారు. రోడ్డుపైకి భారీగా నీరు చేరటంతో అదే స్కూలులో చదువుకుంటున్న ఇద్దరు బాలురు గురువారం తమ సెల్ఫోన్తో సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతలోనే అకస్మాత్తుగా వచ్చిన వరదలో ఇద్దరూ కొట్టుకుపోయారు.
గ్రామస్తులు వారిని రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకపోయిందని ప్రధానోపాధ్యాయుడు మోహన్ తాలూక్దార్ తెలిపారు. కాగా, కుండపోత వానలు, వరదలతో సగం బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. తాజా ఉదంతంతో దేశంలో వరదలతో మృతి చెందిన వారి సంఖ్య 56 కు చేరుకుంది. రెండు లక్షల మంది నిరాశ్రయులు కాగా దాదాపు 6 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.