త్రిచి మీటింగ్తో రజనీ గ్రీన్సిగ్నల్?
చెన్నై: తమిళనాట మరోసారి రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఊహగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో త్రిచిలో నేడు(ఆదివారం) జరగనున్న ఓ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీ నిర్వహించేంది రజనీనో లేక ఆయన అభిమానులో కాదు. తలైవాకు అత్యంత సన్నిహితుడు, గాంధీయ మక్కల్ ఇయక్కమ్ సంఘ నిర్వాహకుడు తమిళరువిమణియన్.
రజనీ అసలు రాజకీయాల్లోకి రావటం ఎందుకు? అన్న అంశంపై ఈ భేటీలో మేధావులు, ప్రజలు చర్చించనున్నారు. ‘రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులంతా డిమాండ్ చేస్తున్నారు. వారి గొంతుకను ఆయన(రజనీకాంత్)కు చేరవేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అంటూ తమిళరువిమణియన్ తెలిపారు.
ఈ సమావేశంలో రజనీ పొలిటికల్ ఎంట్రీతోపాటు నదుల అనుసంధానం, సుపరిపాలన మరియు అవినీతి రహిత రాష్ట్రం వంటి అంశౠలపై ప్రసంగింస్తామని ఆయన వెల్లడించారు. జయలలిత మృతి అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ ముఖాముఖి భేటీలో అభిమానులతో రజనీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రజనీ ఎంట్రీ ఇస్తాడా? బీజేపీలో చేరతాడా? కొత్త పార్టీ పెడతాడా? ఇలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యే డీఎంకే నిర్వహించిన ఓ భేటీలో కమల్ తో పాల్గొన్నాక ఆ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.