ఎక్స్ ప్రెస్ రైల్లో బందిపోట్ల స్వైర విహారం..


జార్ఘండ్ః  రాంచీ-జై నగర్ ఎక్స్ ప్రెస్ లో బందిపోట్లు విజృంభించారు. ప్రయాణీకులను పదునైన ఆయుధాలు, తుపాకులతో బెదిరించి దోపిడీలకు పాల్పడ్డారు. రైల్లోని ఎస్-2 కోచ్ లోకి ఉన్నట్లుండి ప్రవేశించిన దుండగులు.. ప్రయాణీకులను దోచుకోవడమే కాక కత్తులతో గాయపరచినట్లు పోలీసులు తెలిపారు.  



తూర్పు సెంట్రల్ రైల్వే జోన్ లోని చంద్రాపురా స్టేషన్ ప్రాంతంలో ఎక్స్ ప్రెస్ రైల్లోకి ఆరుగురు బందిపోటు దొంగలు చొరబడ్డారని,  ప్రయాణీకుల వద్ద ఉన్న నగదు, నగలతోపాటు భారీగా దోపిడీలకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధాలు, తుపాకులతో ఎస్-2 కోచ్ లోకి  ప్రవేశించిన దుండగులు.. ఇద్దరు ప్రయాణీకులను తీవ్రంగా గాయపరచడంతోపాటు.. ఐదుగురు ప్రయాణీకులనుంచీ నగదు వస్తువులను దోచుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ ఇద్దరు ప్రయాణీకుల్లో ఒకరు ధర్బాంగా జిల్లాల్లో మణిగచ్చి బ్లాక్ కు చెందిన కేశవ్ చౌదరిగానూ, మరొకరు బీహార్ మధుబని జిల్లాకు చెందిన ఉషాదేవిగానూ గుర్తించారు. వారిద్దరికీ కాళ్ళు, చెవుల ప్రాంతాల్లో కత్తి గాయాలు అయ్యాయని, రైలు గమ్యానికి చేరుకున్న అనంతరం బాధితులు ధన్బాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top