అర్జెంట్గా వెళ్లాలన్న తొందర్లో ఓ ఏనుగు..!
కోల్కతా: రైల్వే గేటు పడినా ఎమర్జెన్సీ అంటూ కొందరు పట్టాలు దాటేస్తుంటారు. మరికొన్ని సమయాలలో రైలు ఢీకొని మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. రైల్వే క్రాసింగ్ గేట్ దాటిన ఓ ఏనుగు రైల్వే, అటవీశాఖ ఉద్యోగులకు వణుకు పుట్టించింది. రైల్వే గేటును తన తొండంతో ఎత్తి పట్టాలు దాటి వెళ్లిపోయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని ఛప్రమరి వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోని రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద చోటుచేసుకుంది. అసలు విషయం ఏంటంటే.. ఛప్రమరి వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఓ ఏనుగు తప్పించుకుంది. దీనికి సమీపంలోనే రైల్వే గేట్ ఉంది. అరణ్యం నుంచి తప్పించుకుని వచ్చిన ఆ ఏనుగు రైల్వే గేట్ వద్దకు వచ్చింది.
అటవీ అధికారులు చూస్తే తనను ఎక్కడ బంధించి అరణ్యానికి తరలిస్తారేమోనని ఆందోళనలో ఉంది. తొండంతో ఒక్కసారిగా రైల్వేగేట్ను పైకైత్తి తిరిగి జాగ్రత్తగా గేట్ను ఉన్న స్థానంలో ఉంచేసి అక్కడి నుంచి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షి రోని చౌదరి తెలిపారు. అంతకుముందు చుట్టుపక్కల ఉన్న ఫెన్సింగ్ నుంచి తప్పించుకోవాలని చూసినా.. అది సాధ్యపడదని గ్రహించిన ఏనుగు రైల్వేగేట్ నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. అయితే ఆ సమయంలో రైలు వస్తే తమ పరిస్థితి ఏంటని, ఏనుగుకు ఏదైనా జరిగితే తమని బాధ్యుల్ని చేస్తారని రైల్వే గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న రైల్వే అధికారులు కాసేపు వణికిపోయారు. ఆ తర్వాత రైల్వే ఉద్యోగుల టెన్షన్ అటవీ అధికారులకు పట్టుకుంది. ఏనుగు కోసం వెతకడానికి తీవ్ర యత్నాలు మొదలుపెట్టారని రోని చౌదరి వివరించారు.