సీఎస్‌కు ఉద్వాసన.. కొత్త అధికారి నియామకం

సీఎస్‌కు ఉద్వాసన.. కొత్త అధికారి నియామకం - Sakshi

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావును ఆ పదవి నుంచి తొలగించారు. కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. జయలలిత హయాంలో సీఎస్‌గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై 13 ప్రాంతాల్లో దాదాపు 25 గంటల పాటు ఆదాయపన్ను శాఖ దాడులు జరిగిన విషయం తెలిసిందే. 

 

బుధవారం ఉదయం 5.30 నుంచి గురువారం ఉదయం 6.30 వరకు ఐటీ దాడులు జరగడంతో ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో భారీగా నగలు, నగదు, ఆస్తుల దస్తావేజులు స్వాధీనమయ్యాయి. రాష్ట్రప్రభుత్వానికి ఇది మాయనిమచ్చగా మారిందని అన్ని పక్షాల నుంచి విమర్శలు రావడంతో సీఎం పన్నీర్ సెల్వం హుటాహుటిన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.


అందులోనే సీఎస్‌ను తప్పించాలని గిరిజా వైద్యనాథన్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిజా వైద్యనాథన్.. ముందునుంచి తమిళనాడులోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తొలగించిన రామ్మోహనరావు 1985 బ్యాచ్‌కి చెందినవారు. ఆయన కంటే గిరిజా వైద్యనాథన్ సీనియర్. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top