'గదిలోకి రమ్మనలేదు.. అంతా కట్టుకథే'
రామ్పూర్: తనపై లైంగిక దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలంటే ముందు తన కోరిక తీర్చాలని వేధించాడని ఓ ఎస్సైపై ఫిర్యాదుచేసిన మహిళ కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు ఆ ఎస్సై ఆ మాటలే అనలేదని, కావాలని ఆయనను ఇరికించేందుకు ఆమె తన బోయ్ఫ్రెండ్తో కలిసి కుట్ర చేసినట్లు పోలీసులు తేల్చేశారు. వారిద్దరిని మోసం చేసిన కేసులో అరెస్టు చేసి జైలులో వేశారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంతకుముందు ఆ ఎస్సై తనను వేధించినప్పుడు చేసిన రికార్డింగులను ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపించకుండానే ఆమె బోయ్ఫ్రెండ్ మీదకు నెట్టేసి వారిని జైల్లో వేశారు.
వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జనవరి నెలలో తనపై లైంగిక దాడి జరిగిందని, వారిని అరెస్టు చేసి జైలులో వేయాలంటూ బాధితురాలు రవీంద్ర ప్రతాప్ సింగ్ అనే పోలీసుకు ఫిర్యాదుచేసింది. అయితే, తాను అరెస్టు చేయాలంటే ముందు తన లైంగిక వాంఛను తీర్చాలని అతడు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే నిజం చేస్తూ కొన్ని రికార్డింగులు కూడా ఎస్పీకి అందజేసింది.
అయితే, ఈ కేసును శర వేగంగా రెండు రోజుల్లో దర్యాప్తు చేసిన వారు కాస్త అదంతా ఫేక్ రికార్డింగ్స్ అని, బాధితురాలే కావాలనే ఆ ఎస్సైపై కక్షతో అలా చేసిందని, ఆమె బోయ్ఫ్రెండ్ ఆ రికార్డింగులు తయారు చేశాడని తేల్చేశారు. ఆ మహిళ ఏ ఫోన్లో అయితే, రికార్డు చేసినట్లు చెప్పిందో ఆ ఫోన్ను పరిశీలించగా ఆమె బోయ్ఫ్రెండ్ ఇదంతా చేసినట్లు తెలిసిందని చెప్పారు. దీనిపై ఆ ఎస్సై రవీంద్ర ప్రతాప్ సింగ్ స్పందిస్తూ తాను అసలు ఆమెతో అలాంటి మాటలు మాట్లాడలేదని, తన గదిలోకి రమ్మని ఎప్పుడూ చెప్పలేదని, మొత్తం కట్టుకథ వాళ్లిద్దరు తనపై అల్లారని చెప్పారు.