ఆ టీచర్‌ను వదలొద్దు ప్లీజ్..

ఆ టీచర్‌ను వదలొద్దు ప్లీజ్.. - Sakshi


చెన్నై, సాక్షి: గురువు అనే పవిత్రమైన పదానికే కళంకం తెచ్చాడు ఓ కీచకోపాధ్యాయుడు. తన వద్ద విద్యనభ్యసిస్తున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. అతని లైంగిక వేధింపులు తట్టుకోలేక కౌసల్య అనే ప్లస్‌టూ విద్యార్థిని గురువారం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహంతో రాస్తారోకో చేశారు.




ఈసంఘటన తమిళనాడు రాష్ట్రం దిండివనం సమీపం కట్టళై గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గజేంద్రన్ కుమార్తె కౌసల్య (17) దేవనూరులో ఉంటూ ప్లస్‌టూ చదువుతోంది. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా బాలికకు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడగానే బిగ్గరగా రోదించి గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. ఇరుగుపొరుగు వారు వచ్చి కౌసల్యను కాపాడే ప్రయత్నం చేస్తుండగానే ప్రాణాలు విడిచింది. ఆత్మహత్యకు పాల్పడిన గదిలోకి వెళ్లిచూడగా తాను చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయుడిని ఉద్దేశించి కౌసల్య రాసిన రెండు పేజీల సూసైడ్‌నోట్ దొరికింది.




బైబిల్ సాక్షిగా అతను చెడ్డవాడు...

'పాఠశాలలో జంతుశాస్త్రం బోధించే రమేష్ లైంగిక వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా. బైబిల్ సాక్షిగా నేను చెప్పింది నిజం' అంటూ ఆ లేఖలో బాలిక పేర్కొంది. 'ఆతను ఎంతమాత్రం మంచివాడు కాదు. నాతో తప్పుగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని బైటకు ఎలా చెప్పాలో తెలియలేదు. నాతో మాత్రమే కాదు, ఇతర విద్యార్థినులతో కూడా నీచంగా వ్యవహరించేవాడు. వారందరినీ అడిగి ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. నేను ప్రాణాలతో ఉండి చెబితే నమ్మేవారా' అనేది తెలియదు. 'రమేష్ పెడుతున్న లైంగిక వేధింపుల నుంచి చావుతోనే నాకు విముక్తి. అతడిని వదలొద్దు, కఠినంగా శిక్షించండి' అంటూ ఆ ఉత్తరంలో కౌసల్య తన ఆవేదనను వెళ్లబోసుకుంది. ఈ ఉత్తరాన్ని చదివిన గ్రామస్తులు కౌసల్య మృతదేహంతో గురువారం ఉదయం 10 గంటలకు చెయ్యూరు-మధురాంతకం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘటనతో సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా సొంతూరుకు వెళ్లిపోగా పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top