వింత నిబంధన ఉపసంహరించుకోవాలి

వింత నిబంధన ఉపసంహరించుకోవాలి


విద్య, వాహన, గృహ, వ్యక్తిగత రుణ లావాదేవీల్లో, క్రెడిట్ కార్డులకు సంబంధించి వివాదాలున్నా, బకాయిలు చెల్లించకపోయినా బ్యాంకు ఉద్యోగాలకు అనర్హులని బ్యాంకుల కేంద్రీయ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ విభాగం ప్రకటించడం లక్షలాది మంది నిరుద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఇచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది. ఈ కొత్త నిబంధనను తక్షణమే తొలగించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుండగా దేశ వ్యాప్త ఆందోళనకు దిగుతామని విద్యార్థి, యువజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


 


సుమారు 15 వేల జూనియర్ క్లర్క్‌లు, జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్ పోస్టులకు ఎస్‌బీఐ కేంద్రీయ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ విభాగం ఇటీవల నోటిఫికేషన్ (నంబర్ సీఆర్‌పీడీ/సీఆర్/2016-17/01) ఇచ్చింది. ఇందులో పేర్కొన్న ఓ నిబంధన లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. ‘రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ లేదా ఇతరేతర సంస్థల నివేదిక ప్రకారం చెల్లించనివారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయడానికి అనర్హులు’ అని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులు సాధారణంగా ఏ ఉద్యోగానికైనా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి వస్తోంది. దీంతో క్రెడిట్ కార్డు అవసరంగా మారింది. బ్యాంకు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తూ అప్పటికే అప్పటికే చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నవారు క్రెడిట్ కార్డులు పొందుతున్నారు. చెల్లింపులు సజావుగా చేస్తున్నా చాలా సందర్భాలలో క్రెడిట్ కార్డుల వివాదాలు తప్పడం లేదు.


 


విద్యా, వాహన రుణాల సంబంధిత వివాదాలూ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ వంటి సంస్థలు ఉద్యోగాల భర్తీకి పెడుతున్న నిబంధనలు అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నిరర్ధక ఆస్తుల్ని తగ్గించుకునే క్రమంలో బ్యాంకులు అనుసరిస్తున్న వైఖరి సానుకూలంగా అర్థం చేసుకోవాల్సిన వ్యవహారమే. కానీ ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టి దర్జాగా తిరిగేవారినీ, ఏళ్ల తరబడి ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారినీ ఒకే గాటన కట్టేలా విధించిన నిబంధన ఎంతవరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.




 ఉపాధి హక్కును కాలరాయడమే..

 విద్యారుణం తీసుకుని చదివిన వారిని వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారితో సరిపోల్చడం ఏ మాత్రం సమంజసం కాదని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ బిశ్వాస్, అఖిల భారత ఎంప్లాయీస్ యూనియన్ నేత పి.వెంకట్రామయ్య పేర్కొన్నారు. విద్యా రుణం తీసుకుని చదివిన ఎవరైనా తమకు ఉద్యోగం వచ్చిన తర్వాత చెల్లించడం సర్వసాధారణమని, ఈ విషయాన్ని విస్మరించి డిఫాల్డర్ జాబితాలో పేరుందని అసలు ఉద్యోగానికే అనర్హుల్ని చేయడం అన్యాయమే కాకుండా ఉపాధి హక్కును కాలరాయడమేనని స్పష్టం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top