ఇదొక్కటేనా వార్త?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరులోని విబ్గ్యార్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహనం కోల్పోయి చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి. దర్యాప్తులో పురోగతి గురించి మంగళవారం కొందరు విలేకరులు ఆయనను అడిగినప్పుడు విసుక్కున్నారు. ‘ఇది తప్ప వేరే విషయాలేవీ లేవా, ఇదొక్కటేనా మీకు వార్త’ అని ఎదురు ప్రశ్నించారు. కాగా అత్యాచారాలకు పాల్పడిన వారిపై గూండా నిరోధక చట్టాన్ని ప్రయోగించే విషయమై ప్రశ్నించినప్పుడు, ఎప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ దానిని ఉపయోగిస్తామని సమాధానమిచ్చారు.