శివసైనికుడి దారుణ హత్య

శివసైనికుడి దారుణ హత్య - Sakshi


సాక్షి, ముంబై: మలాడ్‌లోని డోంగ్రీ పరిసరాల్లో మంగళవారం రాత్రి శివసేన గట్ ప్రముఖుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం డోంగ్రీ ప్రాంతానికి చెందిన మహిళను ఈవ్‌టిజింగ్ చేసిన కొందరు ఆకతాయిలను నిలదీసేందుకు గట్ ప్రముఖుడు రమేశ్ జాదవ్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వెళ్లాడు. అక్కడ ఆ యువకులు, జాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సదరు యువకులు జాదవ్ ఇంటికి వచ్చి మళ్లీ గొడవ పడి పదునైన కత్తులతో దాడిచేయడంవల్ల ఆయన అక్కడే మరణించారు.



ఈ విషయం తెలుసుకున్న వందలాది శివసైనికులు స్థానిక దిండోషి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి, శివసేన ఎమ్మెల్యే సునీల్ ప్రభు తదితరులు సైతం అక్కడికి వచ్చి హంతకులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితులు అదుపుతప్పక ముందే నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా అక్కడికి చేరుకుని హంతకులను పట్టుకుంటామని సర్దిజెప్పడంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  కాగా బుధవారం స్థానిక వ్యాపారులు బంద్ నిర్వహించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top