కేంద్ర మహిళా ఉద్యోగుల కోసం షీ బాక్సు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కేంద్రం ఒక కొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు ‘షీ–బాక్స్ (సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్సు)’ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తన వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
తొలుత దీన్ని ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే వర్తింపజేస్తున్నామని త్వరలో ప్రైవేట్ మహిళా ఉద్యోగులకు విస్తరిస్తామని ఆ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. దేశవ్యాప్తంగా లైంగిక వేధింపుల స్వరూపం, తీవ్రతను అంచనా వేసేందుకు త్వరలో ఒక సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. షీ బాక్సులో వచ్చిన ఫిర్యాదులను అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)కి చేరవేస్తామని, ఆ తర్వాత కమిటీ ఫిర్యాదులపై విచారణ చేపడుతుందని మేనకా వివరించారు.