పోలీస్ మనసు దోచుకున్న 'దొంగ'
పాట్నా: ఓ కేసులో నిందితురాలు ఆమె. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పోలీస్ కానిస్టేబుల్ మనసు దోచుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న కానిస్టేబుల్ ప్రపోజల్ కు ఆమె ఒకే చెప్పింది. ఫిబ్రవరి 14న వివాహంతో వీరి కథ సుఖాంతం అయింది. ఖైదీని పోలీసు వివాహం చేసుకోవడాన్ని జైలు చీఫ్ సుజిత్ కుమార్ వ్యతిరేకించారు. అదే సమయంలో ఇది కానిస్టేబుల్ వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు.
మహమ్మద్ ఇనాముల్(52) ఓ కానిస్టేబుల్. ఏడాదిన్నర నుంచి బిహార్ లోని కతిహర్ జైలులో విధులు నిర్వహిస్తున్నాడు. సరిఫుల్ ఖతున్(25) అనే యువతిని చోరీ, కిడ్నాప్ కేసులో గతేడాది కతిహర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 8 నెలలపాటు ఆమె జైలుశిక్ష అనుభవించింది. గతంలోనే వివాహితుడు అయిన కానిస్టేబుల్ ఇనాముల్, సరిఫుల్ పై మనసు పడ్డాడు. ఆమె కూడా ఇనాముల్ ను ప్రేమించింది. తమ ప్రేమను ఎవరూ వ్యక్తం చేయలేదు. చివరగా జైలుశిక్ష పూర్తిచేసుకుని ఆమె విడుదలైంది. ఈ ఫిబ్రవరి 14న తన మనసులోని మాటను సరిఫుల్ కు గులాబీ ఇచ్చి చెప్పాడు. ఇనాముల్ ప్రపోజల్ కు ఆమె ఒకే చెప్పడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
సరిఫుల్ మాట్లాడుతూ.. ప్రేమకు వయసుకు అడ్డంకి కాదని, ప్రేమికులకు వయసు కేవలం ఒక అంకేలా కనిపిస్తుందని చెప్పింది. ప్రతి మహిళ తనకు ఇలాంటి భర్తే ఉండాలని కోరుకుంటారని సరిఫుల్ అంటోంది. ఫిబ్రవరి 14న మసీదులో సరిఫుల్ తల్లిదండ్రులు, సోదరుడి సమక్షంలోనే ఈ వివాహం జరిగిందని సమాచారం. రెండో పెళ్లికి తన మొదటి భార్య ఎలాంటి అడ్డు చెప్పలేదని, ఆమె ఇష్టపూర్వకంగానే ఈ వివాహం జరిగిందని కానిస్టేబుల్ ఇనాముల్ వివరించారు.