'రిజర్వేషన్ కావాలా..పాకిస్తాన్ వెళ్లు..'
ముంబై: మహారాష్ట్రలో వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేసిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై శివసేన మండిపడింది. గత ఆదివారం నాగ్పూర్ సభలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసిన నేపథ్యంలో శివసేన తన అధికార పత్రిక సామ్నాలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
ముస్లింలకు రిజర్వేషన్ కావాలంటే పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రయత్నించుకోమంటూ విరుచుకుపడింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఒవైసీపై ఫడ్నవీస్ ప్రభుత్వం కేసు నమోదు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. భారతదేశాన్ని తమ మాతృభూమిగా ముస్లిలందరూ గౌరవించాలని కోరింది. మహారాష్ట్రలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్న ఒవైసీకి తీవ్రవాదులు, ముస్లిం తీవ్రవాదుల హింసాత్మక చర్యల వల్ల ఎంతమంది హిందువులు నష్టపోయారో తెలుసా అని ప్రశ్నించింది.