ఆందోళన వద్దు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఇకమీదట భద్రతా చర్యలను పోలీసు శాఖ చేపడతుందని నగర కొత్త పోలీసు కమిషనర్ ఎంఎన్. రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో పిల్లలకు ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించిందని వెల్లడించారు. కనుక పాఠశాలల యాజమాన్యాలతో పోలీసు శాఖ నిత్యం సంప్రదింపులు సాగించడం ద్వారా పిల్లల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
మారతహళ్లిలోని విబ్గ్యార్ పాఠశాలలో మంగళవారం ఆయన విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల పాలక మండలి సభ్యులతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పాఠశాలల్లో పిల్లల భద్రతకు అన్ని రకాల చర్యలు చేపట్టినందున, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వారంలోగా అన్నీ గాడిలో పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఒకటో తరగతి బాలికపై అత్యాచారం ఘటనకు సంబంధించి డీసీపీ నాయకత్వంలో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
దీనిపై త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. పాఠశాలల్లో తమ పిల్లల భద్రతృదష్ట్యా తల్లిదండ్రులు 40 డిమాండ్లు యాజమాన్యం ముందు ఉంచారని చెప్పారు. పిల్లల భద్రతపై పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రుల సలహాలను కూడా స్వీకరించామని తెలిపారు. పాఠశాలలో సెక్యూరిటీ గార్డుల నియామకంపై పాలక మండలికి స్పష్టమైన సూచనలిచ్చామని వెల్లడించారు. తమ పిల్లలను తిరిగి పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు కూడా అంగీకరించారని తెలిపారు.