ఆ హీరోల కోసమే అంత పని చేసిందట!
జలంధర్: తాము అభిమానించే హీరోల కోసం ఎంతటి సాహసానికి తెగించే అభిమానులను చాలామందిని చూశాం. సినీ హీరోలకు దేశ విదేశాల్లో వీరాభిమానులుంటారనీ తెలుసు. తనకిష్టమైన అభిమాన హీరోల కోసం, వారిని ఎలాగైనా చూడాలనే పిచ్చి అభిమానంతో చిక్కుల్లో పడిందో ఓ యువతి. అదీ ఓ పాకిస్తానీ అభిమాని. అంతేకాకుండా ఆమె పోలీసులకు చెమటలు పట్టించింది.
ఒకవైపు గురుదాస్ పూర్లో భయోత్పాతం సృష్టించిన సోమవారం నాటి టెర్రరిస్టుల దాడితో దేశంలో హై అలర్జ్ కొనసాగుతోంది....మరోవైపు అనుమానాస్పద స్థితిలో ఓ యువతి పంజాబ్ రైల్వే స్టేషన్లో దిగింది. దీంతో రాష్ట్ర పోలీసులు, నిఘా విభాగం పరుగులు పెట్టారు. తీరా ఆరా తీస్తే బాలీవుడ్ సూపర్ హీరోలను చూడటానికే ఆమె రైలు ఎక్కేసిందని తెలిసి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
పాకిస్తాన్కు చెందిన చందా (27) అనే యువతి... బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్కి పిచ్చఫ్యానట. అందుకే వీసా, పాస్పోర్టు ఇవేవీ పట్టించుకోలేదు. కనీసం రైలు టికెట్ కూడా తీసుకోకుండానే కరాచీ నుంచి ఢిల్లీకి వెళ్లే సంఝౌతా ఎక్స్ప్రెస్ రైలు ఎక్కింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ అనంతరం ఈ విషయాలు వెలుగు చూశాయి. బాలీవుడ్ హీరోల కోసమే ఇంత పనిచేశానన్న ఆ యువతి స్టేట్మెంటును రికార్డు చేసుకొన్న స్థానిక పోలీసులు అనంతరం ఆమెను రైల్వే శాఖకు అప్పగించారు. దీనిపై విచారణ కొనసాగుతుందని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు