రాజ్యసభలో '60 ఏళ్ల మురికి' వివాదం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి తన విదేశీ పర్యటనల్లో 60 ఏళ్ల మురికి శుభ్రం చేస్తానంటూ గత ప్రభుత్వాలపై గుప్పించిన విమర్శలు మంగళవారం రాజ్యసభలో రగడకు దారి తీశాయి. ప్రధాని దేశ గౌరవాన్ని మంటగలిపారని విపక్షాలు తప్పుపట్టగా, అధికారపక్షం ఆయనను గట్టిగా వెనకేసుకొచ్చింది. తీవ్ర వాగ్వాదంతో సభ పలుసార్లు వాయిదా పడింది. అయితే విదేశీ గడ్డపై విపక్షాల గురించి మాట్లాడకుండా ప్రధానిపై నిషేధ ఉత్తర్వులు ఏవీ లేవని, సభా నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు.
గత 60 ఏళ్లలో జరిగిన దానికి భిన్నంగా తమ ప్రభుత్వం నడుస్తుందని, స్వచ్ఛ ప్రభుత్వాన్ని తెస్తామని మోదీకి చెప్పే హక్కు ఉందన్నారు. ప్రధాని వ్యాఖ్యలు కాంగ్రెస్కు ఆందోళన క లిగించడాన్ని అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు. అయితే అవినీతితో కాకుండా అవినీతి ప్రస్తావనతోనే భారత్ పరువుపోతుందని జేడీయూ, సీపీఎం భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఇంటర్నెట్ యుగంలో స్కామ్ గురించి భారత్లో చర్చించినా, బెర్లిన్లో చర్చించినా లోకానికంతా తెలుస్తుందని జైట్లీ అన్నారు.
సంబంధిత వార్తలు