మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మోసం
బెంగళూరు: మెడికల్ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన యువకుడిని అరెస్ట్ చేశామని బెంగళూరు కేంద్ర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అతని నుంచి రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్థానిక సంజయ్నగరలో నివాసం ఉంటున్న మృగాంక్ కుమార్ అలియాస్ విక్కి (30) అనే యువకుడు చెన్నైకి చెందిన మురళి అనే వ్యక్తికి బెంగళూరులో ప్రసిద్ధి చెందిన మెడికల్ కళాశాలలో మెడికల్ సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. అతని నుంచి సంజయ్నగరలో నివాసం ఉంటున్న దీపక్సింగ్, ఢిల్లీకి చెందిన రాహుల్రాజ్, నిహాల్, సందీప్ సికానాతో కలిసి రూ.30 లక్షలు తీసుకున్నారు.
చివరికి మెడి కల్ సీటు రాకపోవడం, నిందితులు తప్పించుకుని తిరగడం, ఫోన్లు స్విచ్ఆఫ్ చెయ్యడంతో మురళికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి విక్కిని అరెస్టు చేశారు. ఈ కేసులో మిగిలిన నిందితులు తప్పించుకున్నారని డీసీసీ సందీప్ పాటిల్ తెలిపారు. నిందితులు మెడికల్ సీట్లు రాని విద్యార్థుల వివరాలు తెలుసుకుని వారిని మోసం చేస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. నిందితులు ఆంధ్రాబ్యాంక్, నేషనల్ పంజాబ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల్లో నకిలీ అడ్రస్లతో అకౌంట్లు ప్రారంభించారని, అమాయకుల నుంచి నగదు డిపాజిట్ చేయించుకుంటున్నారని వివరించారు.