ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
మోగా: ఇప్పటి వరకు ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన సంఘటనల్నే చూశాం. కాని ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని మోగా-ఫిరోజ్ పూర్ రోడ్డులో చోటు చేసుకుంది.
ఏటీఎంకు కాపాలదారుడిగా ఉన్న సెక్యూరిటీ గార్డు కళ్లల్లో రసాయన పదార్ధాలు చల్లి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డు పరిస్థితి విషమంగా ఉందని, కళ్లు కనిపించడం లేదని పోలీసులు వెల్లడించారు. ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 1,70,600 రూపాయలు ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.
మోటార్ వాహనంలో ఏటీఎంను తరలించారని, హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.