'అభ్యర్థి పనిచేయని కారణంగానే ఓటమి'
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ఓటమి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అతి విశ్వాసం, అభ్యర్థి పనిచేయని కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందినట్లు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థి పనిచేయని కారణంగానే ఓటమి చెందినట్లు తెలిపారు.
మాజీ ప్రధాని వాజ్ పేయికి భారతరత్న ఇవ్వడమంటే జాతిని గౌరవించడమేనని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు కూడా కేంద్రం భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని బాబు విన్నవించారు. ఢిల్లీలో పీవీ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ రెవెన్యూలోటు భర్తీకి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు బాబు పేర్కొన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి మరో రూ. 1000 కోట్లు ఇస్తామని కేంద్రం సంకేతాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఏపీ రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో కాలమే చెబుతుందన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానంతో ఏపీ రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రపంచంలోని బెస్ట్ ప్యాకేజీని రాజధాని రైతులకు ఇచ్చామని బాబు తెలిపారు. ఏపీలో తక్షణం హైకోర్టు ఏర్పాటుకు వసతి ఇబ్బందులున్నాయన్నారు. ఏప్రిల్4 వ తేదీని అనంతపురంలో కస్టమ్స్ ఇనిస్టిట్యూట్ కు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.