'బంగారు బాబు'ను చంపేశారు
పుణె(మహారాష్ట్ర): పసిడి చొక్కా, ఒంటి నిండా బంగారంతో అందరి దృష్టిని ఆకర్షించిన పుణెకు చెందిన 'గోల్డ్మన్' దత్తాత్రేయ పుగే హత్యకు గురైయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఆయనను హత్య చేశారు. రాళ్లతో కొట్టి, పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
వక్రతుండ చిట్ఫండ్ పేరుతో పలువురి నుంచి డబ్బులు సేకరించి ఆయన అక్రమాలకు పాల్పడినట్టు గతంలో దత్తాత్రేయపై కేసులు నమోదయ్యాయి. ఆర్థిక అక్రమాల నేపథ్యంలోనే ఆయనను హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. భొసరి ప్రాంతంలోని తమ ఇంటికి గురువారం అర్ధరాత్రి కొంతమంది వచ్చి తన భర్తను తీసుకెళ్లారని దత్తాత్రేయ భార్య సీమా తెలిపారు. దిగిహి సమీపంలోని భారతమాత నగర్కు తీసుకెళ్లి తన భర్తను హత్య చేశారని వెల్లడించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ తరపున గతంలో కార్పొరేటర్గా ఆమె పనిచేసింది. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
22 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన 3.5 కిలోల బరువున్న చొక్కా ధరించడంతో దత్తాత్రేయ పుగే వార్తల్లో నిలిచారు. ఒంటినిండా బంగారం ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు.
సంబంధిత వార్తలు