వాజ్పేయికి 'భారతరత్న' పురస్కారం ప్రదానం
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు. సంప్రదాయానికి భిన్నంగా స్వయంగా రాష్ట్రపతే వాజ్పేయి ఇంటికి వెళ్లి మరీ ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించారు. సాధారణంగా రాష్ట్రపతి భవన్లో ఈ పురస్కారాన్ని అందిస్తారు. అయితే, ఇప్పుడు మాత్రం వాజ్పేయి ఆరోగ్యం ఏమాత్రం బాగోకపోవడం, దాదాపు అచేతనంగానే ఉండటంతో ప్రోటోకాల్ ను పక్కనపెట్టి స్వయంగా రాష్ట్రపతి వెళ్లి ఈ పురస్కారం అందించారు. ఇక జీవించి ఉండగానే భారతరత్న అందుకుంటున్న మొట్టమొదటి మాజీ ప్రధానిగా కూడా వాజ్పేయి చరిత్ర సృష్టించినట్లు అయ్యింది. దేశంలో పూర్తి ఐదేళ్ల కాలం పాటు కాంగ్రెసేతర ప్రభుత్వం నడిపించిన మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా అటల్ బిహారీ వాజ్పేయి నిలిచారు. ఆయన నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
కాగా, వాజ్పేయికి భారతరత్న అవార్డు ప్రదానం కోసం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. వాజ్పేయి ఇంటికి చేరుకున్నారు. ఆయనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు కూడా వాజ్పేయి నివాసానికి వెళ్లారు.