యూజీసీ స్థానంలో కొత్త అథారిటీ!
ఉన్నత విద్యావిధానంలో నూతన ప్రమాణాలను నెలకొల్పేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్థానంలో మరిన్ని అధికారాలతో సరికొత్త సంస్థను ఏర్పాటు చేయాలని యూజీసీ పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటైన ఒక కమిటీ సిఫారసు చేసింది. పార్లమెంటు చట్టం ద్వారా ‘జాతీయ ఉన్నత విద్యాసంస్థ(ఎన్హెచ్ఈఏ)’ పేరుతో ఏర్పాటు చేసే ఆ సంస్థకు పాక్షిక జ్యుడీషియల్ అధికారాలను కల్పించాలని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ హరి గౌతమ్ నేతృత్వంలోని ఆ కమిటీ సూచించింది.
సంస్థ ఏర్పాటు లక్ష్యాల సాధనలో, కాలానుగుణంగా మారుతున్న సంక్లిష్ట సవాళ్లను ఎదర్కోవడంలో యూజీసీ విఫలమైందని అభిప్రాయపడింది. కమిటీ సూచనల్లో.. పీహెచ్డీల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహణ, వీసీల పదవీకాలం ఒకే విడతకు కుదించడం వంటివి ఉన్నాయి. ఎన్హెచ్ఈఏ ఏర్పాటుకు అవసరమైన ముసాయిదా బిల్లును సర్కారుకు కమిటీ అందజేసింది. కాగా, యూజీసీని రద్దుపై ఏ నిర్ణయం తీసుకోలేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.