ఒకే ఒక్క ఛాన్స్ ?
న్యూఢిల్లీ: విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చే చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజున మరో అడుగు ముందుకు వేసింది. తొందరలోనే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తామని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో దాచి పెట్టిన తమ ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించబోతోంది. వన్ టైమ్ ఆపర్చునిటీ కింద ఓ పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. దీంతో నల్లధనం ఉన్న వారికి ఒక గడువును నిర్దేశించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.
ఇలా చేయనివారిపై కఠిన చర్యలుంటాయనీ, పది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించొచ్చని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. అంతేకాదు సదరు వ్యక్తులకు సహకరించిన బ్యాంకులు, సలహాదారులపై కూడా కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తోంది.