భారీగా పాత నోట్ల పట్టివేత


బెంగళూరు: పాత రూ.500, 1000 నోట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.28 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రవీణ్‌సూద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కోణణకుంటెకు చెందిన జిమ్మి రాహుల్, హొన్నావర నివాసి అజయ్‌లు శేషాద్రిపురం పైప్‌లైన్‌ రోడ్డులోని ఒక అపార్టుమెంటును అద్దెకు తీసుకున్నారు. ఇందులో పాత నోట్లను నిల్వచేసి కొత్త నోట్లు మార్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా గురువారం ఉదయం వారిని అరెస్టు చేసినట్లు కమిషనర్‌ సూద్‌ తెలిపారు.


నగదు మార్పిడి చేయడానికి అపార్టుమెంట్‌లో దాచి ఉంచారని ఆయన తెలిపారు. చెలామణి చేయడానికి సాధ్యం కాకపోవడంతో అక్కడే ఉంచారని అన్నారు. నిందితులు రియల్‌ఎస్టేట్‌ దందా నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును సేకరించారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బెంగళూరులో ఇంత పెద్దమొత్తంలో పాత నోట్లు దొరకడం ఇదే మొదటిసారి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top