ఒబామాతో కాంగ్రెస్ ‘అణు’ చర్చలు!


అమెరికా అధ్యక్షుడితో సోనియా, మన్మోహన్ భేటీ

న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన పౌర అణు ఒప్పందం అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సోమవారం చర్చించారు. దీంతోపాటు అమెరికా-భారత్ మధ్య పలు కీలక రంగాల్లో సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం ఒబామా భారత పర్యటనలో స్పష్టత వచ్చిన పౌర అణు ఒప్పందాన్ని గతంలో మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

 

ఈ ఒప్పందం అమల్లో ఇంతకాలం అడ్డంకిగా ఉన్న ‘నష్టపరిహారం’ అంశానికి భారత న్యాయ చట్రం పరిధిలో పరిష్కారం చూపుతామని అమెరికాకు ప్రధాని మోదీ హామీ ఇవ్వడంపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు ఉన్న ఈ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని.. దీనిపై ఒప్పందం పూర్తి ప్రతిని తాము చూడాలని పేర్కొంది.



ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, మన్మోహన్‌తో పాటు రాహుల్‌గాంధీ, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో ఒబామాతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో అణు ఒప్పందం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సోనియా, మన్మోహన్‌లు ఒబామాతో చర్చించినట్లు సమాచారం. ఇరాక్, సిరియాల్లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ ముప్పు వంటి అంతర్జాతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top