వంద రోజుల్లో అద్భుతాలు జరగవు: వెంకయ్య
సాక్షి, విజయవాడ బ్యూరో: వందరోజుల్లో ఎవరూ అద్భుతాలు చేయలేరని, అయినా ప్రధాని మోడీ వంద ముందడుగులు వేశారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. వీటన్నింటినీ పార్టీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయిందని, ఆ స్థానంలోకి బీజేపీ వెళ్లేలా పనిచేయాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్రమే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందన్నారు. బకింగ్హామ్ కెనాల్ను శుభ్రం చేసి నౌకాయానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరిబాబును నిర్ణయిస్తూ జాతీయకౌన్సిల్ చేసిన ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.