'నేను అక్కడ సీఎం అభ్యర్థినా.. నో థ్యాంక్స్'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను బరిలోకి దించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు చేసింది. అయితే, ఈ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, బ్రాహ్మణ వర్గానికి చెందిన షీలాను సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించి లబ్ధి పొందాలని ఆలోచనలు చేసింది. అందులో భాగంగానే గత వారం సోనియాగాంధీ ఆమెతో భేటీ అయి ఈ విషయం చర్చించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడమో లేదా.. ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ఉండటమో రెండిట్లో ఏదో ఒకటి చేయాలని సోనియా ప్రతిపాదించగా తాను ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రం ఆ సాహసం చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. తన పార్టీ వర్గాలతో కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండలేనని, అసలు ఆలోచనే లేదని చెప్పారంట. కాగా, ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా దింపాలనే ఆలోచన చేసింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అట.