ఏపీభవన్ ఉద్యోగులకు నో ఆప్షన్స్?
ఒకే పోస్టు ఉంటే తెలంగాణకే
రెండు పోస్టులుంటే సీనియర్లు తెలంగాణకు, మిగతావారు ఆంధ్రకు..!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొన్నేళ్లపాటు ఉమ్మడిగా ఉండనున్న ఏపీభవన్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకుండా కేవలం పోస్టులు, సీనియారిటీ ఆధారంగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సింగిల్ పోస్టుల (ఒక్కపోస్టు మాత్రమే) స్థానంలో ఉన్న ఉద్యోగులను తెలంగాణకు, డబుల్ పోస్టులు (రెండేసి పోస్టులు) ఉన్న స్థానంలో సీనియర్ని తెలంగాణకు, జూనియర్ని ఆంధ్రప్రదేశ్ కేటాయించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన అనధికార సమాచారాన్ని ఏపీభవన్ ఉద్యోగులకు చేరవేసింది. ఇరు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులనే ఇరురాష్ట్రాలకు 42:58 నిష్పత్తిని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏపీభవన్లో ఉన్న 90మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది సీమాం ధ్రులే ఉన్నారు. స్థానికత, సీనియారిటీ ఆధారంగా లేక ఆప్షన్ల ద్వారాఉద్యోగుల విభజన చేపట్టినా తెలంగాణకు దక్కే ఉద్యోగులసంఖ్య తక్కువగా ఉంటుంది. ఏపీభవన్ అధఙకారులకు అందిన సమాచారం మేరకు విభజన పంపిణీ ఇలా ఉంది..
- ఏపీభవన్లోని న్యాయవిభాగంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు ఇద్దరూ ఆంధ్రావారే కావడం తో సర్వీస్లో సీనియర్ను తెలంగాణకు, జూనియర్ని ఆంధ్రాకు కేటాయించారు. ఇక ఇదే విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులో ఒక్కరే ఉండటంతో ఆయన్ను తెలంగాణకు కేటాయిం చారు. మిగతా పోస్టుల్లోనూ ఇదేరీతిన విభజన చేపట్టారు.
- గెస్ట్హౌస్ నిర్వహణకు సంబంధించి డిప్యూటీ కమిషనర్, ప్రోటోకాల్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, హౌస్ కీపర్ పోస్టుల్లో ఒక్కరే ఉద్యోగి ఉండటంతో వారందరినీ తెలంగాణకే కేటాయించారు.
- అసిస్టెంట్ కమిషనర్, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత కార్యదర్శి, లైజనింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్ పోస్టుల్లో ఇద్దరేసి ఉండటంతో ఇక్కడ సీనియర్ను తెలంగాణకు, జూనియర్ని ఆంధ్రాకు కేటాయించారు. మిగతా పోస్టుల్లోనూ ఇదే రీతిన విభజన చేపట్టారని తెలుస్తోంది.
- సింగిల్ పోస్టులన్నీ తెలంగాణకే కేటాయించనున్న నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతం వారికోసం కొత్త పోస్టులు సృష్టించక తప్పని పరిస్థితి. దానికి సంబంధించి కసరత్తు శరవేగంగా జరుగుతోందని అధికారులు తెలిపారు.