దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం

నరేంద్ర మోదీతో భేటీ కానున్న నితీష్‌ - Sakshi


న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిత్వంపై ఓ వైపు కసరత్తు జరుగుతుంటే ఇంకోవైపు హస్తినలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.  విపక్షాల భేటీకి డుమ్మా కొట్టిన బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్‌ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. బీహార్ అభివృద్ధికి సంబంధించి ఆయన ప్రధానితో చర్చించనున్నారు. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ కావడానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు.



అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశగా విపక్షాలు మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో 17 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. కాగా నితీష్ కుమార్‌కు చెందిన  జేడీయూ నుంచి సీనియర్ నేత శరద్ యాదవ్ కూడా ఈ విందు భేటీకి హాజరయ్యారు.


నితీష్‌ మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయన రేపు (శనివారం) ప్రధాని మోదీని కలవడానికి సిద్ధం కావడమే ఆసక్తి రేపుతోంది. పైగా బిహార్‌లో జేడీయూ మిత్రపక్షమైన ఆర్జేడీతో నితీష్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడంపై నితీష్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top