‘మా భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు’
న్యూఢిల్లీ: జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మారిషస్ ప్రధానమంత్రి ప్రవీద్ కుమార్ జగ్నౌత్ కు... ప్రధాని ఇచ్చిన విందుకు నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. నితీష్ కుమార్ ఇవాళ ప్రధానితో విందు సమావేశంలో పాల్గొన్నట్లు పీఎంవో ట్విట్ చేసింది.
ప్రధానితో సమావేశం అనంతరం నితీష్ మీడియాతో మాట్లాడుతూ తమ భేటీలో గంగానదిలో పూడిక ప్రమాదస్థాయికి చేరినందున వరదలు ముంచెత్తుతున్నాయని... ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చి, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరినట్లు ఆయన వెల్లడించారు. అంతేకానీ తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని నితీష్ కుమార్ చెప్పుకొచ్చారు.
కాగా విపక్షాల రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన ఎన్డీయే నేతృత్వంలో జరిగిన సమావేశానికి నితీష్ కుమార్ గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. అయితే జేడీయూ తరఫున శరత్ యాదవ్, కేసీ త్యాగి హాజరు అయ్యారు. దీనిపై నితీష్ మాట్లాడుతూ తాను గతనెల 20న సోనియాగాంధీను కలిశానని, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశాలను అప్పుడే ఆమెతో చర్చించినట్లు చెప్పారు.