కోర్టుకు చేరిన నిత్యానంద పుంసత్వ పరీక్షల నివేదిక

నిత్యానంద


బెంగళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద పుంసత్వ పరీక్షల నివేదిక  కోర్టుకు చేరింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం  సెప్టెంబరు 29న స్థానిక విక్టోరియా ఆస్పత్రిలో, మడివాళలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పుంసత్వ పరీక్షలు నిర్వహించారు. తనపై నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ ప్రవాస భారతీయురాలి ఫిర్యాదుతో 2010లో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. తాను పసి బిడ్డతో సమానమని నిత్యానంద ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ పరీక్షల నుంచి తనను మినహాయించాలని ఆయన హైకోర్టును కోరారు.  



తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని,  అందువల్ల తనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు.  ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. కేసుకు సంబంధించిన సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు  తీర్పు చెప్పింది.  కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.   దీనిని సవాలు చేస్తూ నిత్యానంద సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురైంది. దాంతో నిత్యానందకు పరీక్షలు చేయించుకోక తప్పలేదు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు ఇంకా పూర్తి కాలేదు.



బిడది వద్ద 2003లో ధ్యాన పీఠం ఆశ్రమం స్థాపించిన నిత్యానంద సినిమా నటి రంజితతో రాసలీలల సీడీ వెలుగులోకి వచ్చేవరకు అప్రతిహతంగా తన బోధనలు సాగించారు. ఆ తరువాత వరుస వివాదాలు, పోలీస్ కేసులు, అత్యాచార ఆరోపణలు, వివిధ సంఘాల నిరసనలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.  దాంతో ఆయన బెంగళూరు వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో తన స్వగ్రామం తమిళనాడులోని తిరువణ్ణామలై వెళ్లిపోయారు.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top