వాడి ఇంటర్వ్యూకు అనుమతి ఎలా ఇచ్చారు?
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు ముఖేష్ కుమార్ ఇంటర్వ్యూ ఉదంతం కలకలం రేపుతోంది. మార్చి 8 సందర్భంగా బీబీసి కి ఇంటర్య్వూఇచ్చాడని చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో అత్యాచారాలకు అమ్మాయిలదే ప్రధాన బాధ్యత అంటూ ముఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి . జైలు శిక్షవేసినా నిర్భయ దోషి మనస్తత్వంలో మార్పురాలేదనీ...అసలు జైల్లో ఉన్నదోషిని ఇంటర్య్వూ చేయడానికి ఎలా అనుమతిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో హోం శాఖ రంగంలోకి దిగింది.
హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీహార్ జైలు అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో అతని ఇంటర్య్వూకు అనుమతిచ్చారంటూ జైలు డీజీని ప్రశ్నించారు.
మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు ఈ ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలోని చట్టాల్లోని లోపాల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిర్భయ తల్లి ఆరోపించారు. అమ్మాయిలకు రక్షణ ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ తండ్రి కూడా ఈ సంఘటనపై మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు మహిళల స్వేచ్ఛను వ్యతిరేకిస్తారని, అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎక్కడికైనా వెళ్లే హక్కు, పనిచేసుకునే హక్కు ఆడపిల్లలకు ఉందని చెప్పారు.
ఇది ఇలా వుంటే డాక్యుమెంటరీ తీసిన వ్యక్తి నిబంధనలను వ్యతిరేకించారని, ఈ ఇంటర్యూ బైటపెట్టే ముందు సంబంధిత వీడియోను తమకు చూపించలేదన్న తీహార్ జైలు అధికారులు ఆరోపణలను హోంమంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం.