‘నాక్కూడా తుపాకీ ఇచ్చి కాల్చమన్నారు’
గడ్చిరోలి: సుకుమాలో కేంద్ర బలగాలపై దాడులకు పాల్పడి దాదాపు 25మంది జవాన్లను చంపేసిన తర్వాత మావోయిస్టులు పండగ చేసుకున్నారని, మూడు రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్నారని తెలిసింది. ఈ దాడి జరిగిన నెల రోజుల తర్వాత చింతగుఫా అనే గ్రామానికి చెందిన సర్పంచ్, సీపీఐ కార్యకర్త పొడియం పాండా పోలీసులకు లొంగిపోయిన సందర్భంగా ఈ విషయం చెప్పాడు. పాండాకు మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ అతడు మాత్రం సుకుమా దాడి జరిగిన వారం రోజుల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.
‘కొన్ని గ్రామాల్లో మావోయిస్టులు జీవిస్తున్నారని పాండా మాకు సమాచారం ఇచ్చాడు. దీంతో మేం ఓ ఎనిమిదిమందిని అరెస్టు చేశాం. ఎలాంటి ప్రమాదం ఉండకుండా అతడి వివరాలు బయటకు తెలియనివ్వలేదు’ అని పోలీసులు చెప్పారు. కాగా, ఈ దాడి తర్వాత విచారణ వేగంగా చేపడుతున్న తమకు పాండాను విచారించగా పలు విషయాలు చెప్పాడని, వాటిని తాము వీడియో రికార్డింగ్ చేశామని తెలిపారు. పోలీసులకు పాండా చెప్పిన వివరాలు ఏమిటంటే..
‘దాడి జరిగే సమయంలో నేను మావోయిస్టులతోనే ఉన్నాను. సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన తర్వాత వారు మూడు రోజులపాటు డ్రమ్స్ మోగిస్తూ పలు వాయిద్యాలతో సందడి చేస్తూ ఉత్సవాలు చేసుకున్నారు. బురకపాల్ (సుకుమా)దాడి కోసం దాదాపు నెల రోజులపాటు తీవ్రంగా ఆలోచించి ప్రణాళిక రచించి నెల తర్వాత అమలు చేశారు. ఆ సమయంలో వారు ఫదిగుడా-బురకపాల్ మధ్య క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. కమాండర్ హిద్మా ఈ దాడికి ప్రధాన సూత్రధారి. ఆయనకు అత్యంత సన్నిహితంగా కమాండర్ అర్జున్, సీతా, నాగేశ్ ఉన్నారు.
మరికొంతమంది కూడా ఆ తర్వాత ఈ దాడి కోసం జాయిన్ అయ్యారు. ఆ తర్వాత నన్ను ఏప్రిల్ 18న అర్జున్ క్యాంప్కు తీసుకెళ్లారు. వివిధ గ్రూపులుగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేశారు. తమకు సహాయం చేయాలని చింతగుఫా గ్రామస్తులను ఏప్రిల్ 23న కోరారు. మొత్తం 400మంది ఆ రోజు దాడికి బయలుదేరారని, అందులో తనకు కూడా ఓ తుపాకీ ఇచ్చి, ఎనిమిది కాట్రిట్జ్లు ఇచ్చి దాడి చేయాలని చెప్పారు. ఈ దాడిలో 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన తర్వాత ఫదిగూడా బురకపాల్ మధ్య ఉన్న క్యాంపులో డప్పులు వాయిస్తూ డ్యాన్స్లు వేశారు. ఆ తర్వాత ప్రసంగించారు’ అంటూ దాడి అనంతరం మావోయిస్టులు ఏం చేశారనే వివరాలను పాండా వివరించాడు.