బ్రహ్మోస్‌ పరీక్ష విజయవంతం

బ్రహ్మోస్‌ పరీక్ష విజయవంతం


నౌకపై నుంచి భూఉపరితల లక్ష్యాల్ని ఛేదించిన క్రూయిజ్‌ క్షిపణి

న్యూఢిల్లీ: భారత నౌకాదళం శుక్రవారం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సముద్రంపై నుంచి భూ ఉపరితలంపై నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించే బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని (ల్యాండ్‌ అటాక్‌ మిస్సైల్‌) విజయవంతంగా ప్రయోగించింది. దీంతో గతంలో ఈ ఘనత సాధించిన మరో నాలుగు దేశాల సరసన భారత్‌ స్థానం సంపాదించుకుంది. బంగాళాఖాతంలోని ఐఎన్‌ఎస్‌ టెగ్‌ నౌక నుంచి ఈ దీర్ఘశ్రేణి క్షిపణిని భూమిపై నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించగా... ఆశించిన ఫలితాలు దక్కాయని నేవీ ఉన్నతాధికారులు తెలిపారు.


ఈ క్షిపణి పరీక్ష భారత నౌకాదళ పరాక్రమాన్ని మరింత పెంచిందని, ఆ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనాల సరసన భారత్‌ నిలిచేలా చేసిందని నేవీ ప్రతినిధి కెప్టెన్‌ డీకే శర్మ  చెప్పారు. మన నౌకాదళంలో కోల్‌కతా, రణ్‌వీర్, టెగ్‌ నౌకలకు ల్యాండ్‌ అటాక్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణుల్ని ప్రయోగించే సామర్థ్యముంది. అలాగే ఒక నౌక నుంచి మరో నౌకపై నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించే యాంటీ షిప్‌ క్షిపణి వ్యవస్థ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇటీవల కాలంలో ఆయుధ వ్యవస్థతో పాటు క్షిపణి ప్రయోగవేదికల్ని భారత నౌకాదళం ఆధునీకరిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top