ముందు ‘సరిహద్దు’ను తేల్చాలి

ముందు ‘సరిహద్దు’ను తేల్చాలి - Sakshi


చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ స్పష్టీకరణ

 

న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు బుధవారం తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. గురువారం ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చల్లో చైనాతో సరిహద్దు సమస్యలను నిర్మొహమాటంగా ప్రస్తావించారు. భారత భూభాగంలోకి చైనా వైపు నుంచి చొరబాట్లు పునరావృతం అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యమే ఇరు దేశాల మధ్య విశ్వాసానికి పునాది అవుతుందని స్పష్టంచేస్తూ.. సరిహద్దుకు సంబంధించి శాంతి ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. అపరిష్కృతంగా ఉన్న వాస్తవాధీన రేఖపై స్పష్టత అంశాన్ని త్వరగా తేల్చాలని కోరారు.

 

ఇందుకు జిన్‌పింగ్ సానుకూలంగా స్పందిస్తూ.. సరిహద్దు సమస్యలను స్నేహపూర్వక సంప్రదింపుల ద్వారా సత్వరమే పరిష్కరించుకునేందుకు చైనా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం బుధవారం అహ్మదాబాద్‌లో పర్యటించిన జిన్‌పింగ్ గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా లడఖ్ వద్ద చైనా సైనికులు, పౌరులు తాజాగా భారత భూభాగంలోకి చొరబాట్లకు పాల్పడుతున్న నేపధ్యంలో.. మోదీ సరిహద్దు అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలూ కొంత సేపు ఏకాంతంగా ముఖాముఖి చర్చించుకున్నారు. ప్రతినిధుల స్థాయి చర్చలూ నిర్వహించారు. వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో సహకారంపై ఒప్పందాలకు సంబంధించి మంతనాలు జరిపారు.

 

అయితే.. చుమార్, దేమ్‌చోక్ సెక్టార్లలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తాజా చొరబాట్లు చోటు చేసుకోవటంతో వీరి చర్చలు ప్రధానంగా సరిహద్దు సంఘటనల చుట్టూతా తిరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 2,000 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని చైనా నిర్ణయించింది. దానితో పాటు మొత్తం 12 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. అయితే.. ఇటీవల మోదీ జపాన్ పర్యటనలో ఆ దేశంతో 3,500 కోట్ల డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. జిన్‌పింగ్ భారత పర్యటనలో అంతకన్నా చాలా ఎక్కువ పెట్టుబడులకు ఒప్పందాలు కుదురుతాయని ప్రభుత్వ వర్గాలు ఆశించాయి. కానీ జపాన్ కన్నా చాలా తక్కువ స్థాయిలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదరటం ఆ వర్గాలను నిరాశపరిచింది.

 

భేటీ అనంతరం చైనా అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. జిన్‌పింగ్ భారత పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి ఒక చరిత్రాత్మక అవకాశమని అభివర్ణించగా.. భారత్, చైనాలు ఏకం కావటం ఆసియాకు అతి పెద్ద ఘటన అని జిన్‌పింగ్ అభివర్ణించారు. ఇరుగుపొరుగు వారి మధ్య సమస్యలు ఉంటాయని.. అయితే కేవలం ఈ విభేదాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించరాదని ఆయన వ్యాఖ్యానించారు.

 

మహాత్ముడికి జిన్‌పింగ్ నివాళి

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు గురువారం ఉద యం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆవరణలో అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ఆయన ఆ తర్వాత రాజ్‌ఘాట్‌ను సందర్శించి  మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఉదయం 9:30 గంటలకు తన భార్య పెంగ్ లియువాన్‌తో కలిసి రాజ్‌ఘాట్‌కు చేరుకున్న జిన్‌పింగ్ అక్కడ స్మారక చిహ్నంపై పూలగుచ్ఛం ఉంచి పది నిమిషాల పాటు గడిపారు. సందర్శకుల పుస్తకంలో జిన్‌పింగ్ మండారిన్ భాషలో వ్యాఖ్యలు రాశారు. గురువారం దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో జిన్‌పింగ్ ప్రయాణాలు, ఆయనకు వ్యతిరేకంగా టిబెటన్ల నిరసన ప్రదర్శనల ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది.

 

ఐదేళ్లలో 2,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు

జిన్‌పింగ్, మోదీల శిఖరాగ్ర చర్చల అనంతరం భారత్‌లో రెండు పారిశ్రామిక పార్కుల ఏర్పా టు, రైల్వేల్లో పెట్టుబడులు పెట్టడం సహా పలు అంశాలపై రెండు దేశాలూ 12 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్, చైనాల మధ్య పౌర అణు ఇంధన సహకారంపై రెండు దేశాలూ చర్చలు ప్రారంభించాలని జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా నిర్ణయించినట్లు మోదీ ప్రకటించారు. ‘‘పౌర అణు ఇంధన సహకారంపై మేం చర్చల ప్రక్రియను ప్రారంభిస్తాం. ఇది ఇంధన భద్రతపై రెండు దేశాల మధ్య విస్తృత సహకారానికి మరింత ఉత్తేజాన్నిస్తుంది’’ అని ఆయన జిన్‌పింగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.  

 

* భారత్ - చైనాల మధ్య ఐదేళ్ల వాణిజ్య, ఆర్థిక సహకారంపై ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం చైనా వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 2,000 కోట్ల డాలర్లు పెట్టుబడులుగా పెడుతుంది.

* భారత తీర్థయాత్రికుల వార్షిక కైలాస్ మానస సరోవర్ యాత్ర కోసం.. ప్రస్తుతం ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ మార్గంతో పాటు.. సిక్కింలోని నాథులా మార్గం ద్వారా కూడా వెళ్లేందుకు చైనాతో భారత్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సంతకాలు చేశారు. దీనిద్వారా మానస సరోవర్ యాత్రలో దూరం, సమయం, కష్టతరమైన ప్రయాణం గణనీయంగా తగ్గిపోనున్నాయి.

* భారతీయ రైల్వే వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చైనా అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. రైళ్ల వేగాన్ని పెంచటం, హైస్పీడ్ రైలు మార్గాలపై సహకారానికి గల అవకాశాలను అధ్యయనం చేయటం, రైల్వే స్టేషన్ల పునర్‌అభివృద్ధికి సంబంధించిన ఒప్పందాలివి.

* ఇరు దేశాలకు చెందిన ప్రొడ్యూసర్లు (నిర్మాతలు) తమ సృ జనాత్మక, కళాత్మక, సాంకేతిక, ఆర్థిక, మార్కెటింగ్ వనరులను సమీకృతం చేసుకుని ఉమ్మడిగా సినిమాలు నిర్మించేందుకు వీలుగా ఒప్పందం కుదిరింది.

* సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సీమాంతర ఆర్థిక నేరాలు, కస్టమ్స్ నేరాలపై పోరాటంలో సహకారాన్ని పెంపొందించుకోవటం లక్ష్యంగా కస్టమ్స్ పరిపాలనకు సంబంధించి భారత్, చైనాలు మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

* అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకోవటంలో సహకారానికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది.

* రెండు దేశాలకు చెందిన వివిధ సాంస్కృతిక సంస్థల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు మరొక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇందులో ప్రదర్శనశాలలు, పురావస్తు సంస్థలు, కళాసాంస్కృతిక సంస్థలు ఉన్నాయి.

* ఔషధాల ప్రమాణాలు, సంప్రదాయ ఔషధాలు, ఔషధాల పరీక్షల రంగాల్లో కూడా సహకారం పెంపొందించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి.

* మహారాష్ట్రలోని ముంబై నగరానికి చైనాలోని షాంఘై నగరానికి మధ్య సహోదర సంబంధాన్ని నెలకొల్పేందుకు మరొక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇరు దేశాల ప్రజల రాకపోకలను పెంపొందిస్తుంది.

 

చైనా అధ్యక్షుడికి దలైలామా ప్రశంసలు

ముంబై: భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అనూహ్యంగా.. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా నుంచి ప్రశంసలు లభించాయి. జిన్‌పింగ్ విశాల దృక్పథం ఉన్న, వాస్తవికవాది అని టిబెట్ నుంచి బహిష్కారానికి గురై భారత్‌లో ప్రవాసముంటున్న దలైలామా కీర్తించారు. సుహృద్భావమనేది విశ్వాసం ద్వారానే తేవచ్చునని.. భయం ద్వారా కాదని వ్యాఖ్యానించారు. చైనా కొత్త నాయకత్వంపై తనకు విశ్వాసముందన్నారు.

 

భారత్‌కు స్ఫూర్తి చైనా!: ప్రణబ్

చైనా అధ్యక్షుడికి భారత రాష్ట్రపతి విందు

న్యూఢిల్లీ: లడఖ్‌లో భారత్, చైనా సైనిక దళాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా, పొరపాట్లకు తావులేని చర్చల ప్రక్రియ కొనసాగాలన్న ఆశాభావాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వ్యక్తంచేశారు. సరిహద్దు సమస్య సహా ఇరుదేశాల మధ్య ఉన్న అన్ని సమస్యల సామరస్య పరిష్కారాన్ని భారత్, చైనాలు కోరుకుంటున్నాయన్నారు.  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గౌరవార్ధం ఆయన గురువారం ఒక విందును ఏర్పాటు చేశారు. చైనా సాధిస్తున్న ఆర్థికాభివృద్ధిని చూసి భారత్ స్ఫూర్తి పొందుతోందన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.

 

లడఖ్ నుంచి చైనా దళాల ఉపసంహరణ

ఈశాన్య లడఖ్‌లోని చుమర్ ప్రాంతం వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి, గత నాలుగు రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన చైనా సైనిక దళాలు గురువారం రాత్రి భారత్ భూభాగం నుంచి వెనక్కు మరలాయి. రాత్రి 9.45 నుంచి చైనా దళాల ఉపసంహరణ ప్రారంభమైందని భారత అధికార వర్గాలు వెల్లడించాయి. అక్కడే పెద్ద సంఖ్యలో ఉన్న భారత దళాలు కూడా క్రమంగా వెనక్కు వెళ్తున్నాయని తెలిపాయి. చైనా దళాలు వాస్తవాధీన రేఖకు కాస్త ఆవలగానే ఉంటున్నందున భారత దళాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయని పేర్కొన్నాయి.

 

అయితే, చైనా సంచార జాతులైన ‘రెబో’లు భారత భూభాగంలోని దెమ్చాక్‌లో గత 12 రోజులుగా గుడారాలు వేసుకుని ఉంటున్న విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top