మోడీ పాలన భేష్

మోడీ పాలన భేష్ - Sakshi


కేంద్ర మంత్రి అనంత కుమార్

 

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  ప్రధాని నరేంద్ర మోడీ వంద రోజుల పాలనలో ఎంతో సాధించారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ కితాబునిచ్చారు. మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన బెంగళూరు నగర జిల్లా శాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. యూపీఏ హయాంలో వంట గ్యాస్‌కు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని, తమ ప్రభుత్వం వచ్చాక వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లు అందేలా చూస్తున్నదని వెల్లడించారు. మన్మోహన్ సింగ్ పదేళ్ల హయాంలో దేశానికి లభించని అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలను కేవలం వంద రోజుల్లోనే మోడీ సాధించగలిగారని ప్రశంసించారు.

 

ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానికి అపూర్వ స్వాగతం పలకడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 23న సాయంత్రం అయిదు గంటలకు హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి వస్తున్న మోడీకి ఘన స్వాగతం పలకడంతో పాటు సత్కరించనునున్నట్లు చెప్పారు. కనుక నగరంలోని ప్రతి వార్డూ, నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు.



నగరానికి వచ్చిన వెంటనే ప్రధాని తొలుత ఇస్రోను సందర్శిస్తారని, మార్గ మధ్యంలో కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. 24న ఉదయం పది గంటలకు తుమకూరులో ఇండియా ఫుడ్ పార్కుకు శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ మంత్రులు ఆర్. అశోక్, అరవింద లింబావళి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top